america: భారత్‌కు రెండో అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా అమెరికా!

  • భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న రెండో దేశం అమెరికా
  • సౌదీ అరేబియాను అధిగమించిన అగ్రరాజ్యం
  • దశాబ్ద కాల కనిష్ఠానికి సౌదీ దిగుమతులు
  • భారత్‌కు అతిపెద్ద చమురు ఎగుమతిదారుగా కొనసాగుతున్నఇరాక్‌
US becomes Indias second biggest oil supplier

భారత్‌కు అత్యధికంగా చమురు సరఫరా చేస్తున్న రెండో దేశంగా అమెరికా అవతరించింది. ఈ స్థానంలో ఉన్న సౌదీ అరేబియాను అగ్రరాజ్యం గత నెల అధిగమించింది. చమురు ఉత్పత్తి దేశాలు (ఒపెక్‌ ప్లస్) ఉత్పత్తిలో కోత విధించడంతో ఏర్పడ్డ లోటును పూడ్చుకునేందుకు అమెరికా నుంచి భారత్‌ భారీ స్థాయిలో కొనుగోలును పెంచింది. ఈ నేపథ్యంలోనే సౌదీ అరేబియా స్థానం గల్లంతైనట్లు వ్యాపార వర్గాలు తెలియజేశాయి.

అమెరికాలో ఇటీవల చమురుకు డిమాండ్‌ తగ్గింది. ఇదే సమయంలో రోజుకి ఒక మిలియన్‌ బ్యారెళ్ల ఉత్పత్తిని తగ్గించాలని ఒపెక్‌ ప్లస్‌ దేశాలు నిర్ణయించాయి. ఈ పరిణామాలు భారత్‌లోని అవసరాలకు కలిసొచ్చాయి. ప్రస్తుతం ప్రపంచంలోనే అతిపెద్ద చమురు ఉత్పత్తిదారుగా అమెరికా ఉన్న విషయం తెలిసిందే. జనవరితో పోలిస్తే ఫిబ్రవరిలో భారత్‌కు అగ్రరాజ్యం నుంచి చమురు దిగుమతి 48 శాతం పెరిగింది. రోజుకు సగటున 5,45,300 బ్యారెళ్లు భారత్‌కు వచ్చాయి. భారత్‌ దిగుమతి చేసుకుంటున్న మొత్తం చమురులో అమెరికాదే 14 శాతం వాటా.

ఇక ఫిబ్రవరిలో సౌదీ అరేబియా నుంచి దిగుమతులు 42 శాతం తగ్గాయి. రోజుకి 4,45,200 బ్యారెళ్ల చమురు అందింది. సౌదీ నుంచి దిగుమతులు ఈ స్థాయికి పడిపోవడం గత దశాబ్ద కాలంలో ఇదే తొలిసారి. 2006, జనవరి తర్వాత భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న జాబితాలో సౌదీ అరేబియా తొలిసారి నాలుగో స్థానానికి పడిపోయింది.  

భారత్‌కు చమురు ఎగుమతి చేస్తున్న అతిపెద్ద దేశంగా ఇరాక్‌ కొనసాగుతోంది. మొత్తంగా చూస్తే ఆ దేశం నుంచి భారత్‌కు చమురు ఉత్పత్తి 23 శాతం పడిపోయి ఐదు నెలల కనిష్ఠానికి చేరింది.  అయినప్పటికీ తొలిస్థానంలోనే కొనసాగుతోంది. ఇరాక్‌ నుంచి రోజుకు సగటున 8,67,500 బ్యారెళ్ల చమురు భారత్‌కు అందుతోంది. ఒపెక్‌ ప్లస్ దేశాలతో కుదిరిన ఒప్పందం మేరకు 2021లో భారత చమురు శుద్ధి కేంద్రాలకు ఇచ్చే దాంట్లో 20 శాతం తగ్గించాలని ఇరాక్‌ నిర్ణయించింది.

More Telugu News