CJI: జూనియర్ అధికారిణితో సరసాలాడడం న్యాయమూర్తికి తగని పని: ఓ కేసులో సీజేఐ బోబ్డే వ్యాఖ్యలు

  • రిటైర్డ్ జడ్జిపై హైకోర్టును ఆశ్రయించిన మహిళా అధికారి
  • శాఖాపరమైన విచారణకు ఆదేశించిన హైకోర్టు
  • తన ఫిర్యాదును వెనక్కి తీసుకున్న అధికారిణి
  • విచారణ కొనసాగించేందుకు హైకోర్టు నిర్ణయం
  • హైకోర్టు నిర్ణయాన్ని సుప్రీంలో సవాల్ చేసిన రిటైర్డ్ జడ్జి
CJI comments in a case of retired judge

ఓ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎస్ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జూనియర్ అధికారిణితో సరసాలాడడం ఓ న్యాయమూర్తికి తగని పని అని హితవు పలికారు.

ఆ వివరాలలోకి వెళితే... ఓ రిటైర్డ్ జడ్జి తనను వేధిస్తున్నాడంటూ ఓ మహిళా అధికారి మధ్యప్రదేశ్ హైకోర్టును ఆశ్రయించింది. ఆపై ఆమె తన ఫిర్యాదును ఉపసంహరించుకుంది. అయినప్పటికీ హైకోర్టు ఆ జిల్లా మాజీ జడ్జిపై విచారణకు ఆదేశించింది. హైకోర్టు నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆ రిటైర్డ్ జడ్జి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మధ్యప్రదేశ్ హైకోర్టు ఆదేశించిన క్రమశిక్షణ చర్యలను సవాల్ చేశాడు.

దీనిపై విచారణలో భాగంగా సీజేఐ ఎస్ఏ బోబ్డే స్పందిస్తూ... మధ్యప్రదేశ్ హైకోర్టు విధి నిర్వహణకు కట్టుబడి ఈ నిర్ణయం తీసుకుందని, రిటైర్డ్ జడ్జి తన పిటిషన్ ను వెనక్కి తీసుకోవాలని హితవు పలికారు. కాగా వాదనల సందర్భంగా మధ్యప్రదేశ్ హైకోర్టు తరఫున సీనియర్ న్యాయవాది రవీంద్ర శ్రీవాస్తవ హాజరయ్యారు. మహిళా అధికారికి రిటైర్డ్ జడ్జి పంపిన వాట్సాప్ సందేశాలను చదివి వినిపించారు. తన కన్నా జూనియర్ అయిన మహిళా అధికారితో మరింత విజ్ఞతతో మెలిగితే బాగుండేది అని అభిప్రాయపడ్డారు. ఈ వాదనలతో ఎస్ఏ బోబ్డే ఏకీభవించారు.

ఇక, రిటైర్డ్ జడ్జి తరఫున ఆర్ బాలసుబ్రహ్మణ్యం వాదనలు వినిపించారు. హైకోర్టు ఆదేశించిన మేరకు క్రమశిక్షణ చర్యలు, దర్యాప్తు కొనసాగించలేమని, ఎందుకంటే ఆ మహిళా అధికారి ఇప్పటికే తన ఫిర్యాదును వెనక్కి తీసుకుందని వివరించారు.

అయితే, మరిన్ని వేధింపులు ఎదురవుతాయన్న ఉద్దేశంతో ఆ మహిళా అధికారి తన ఫిర్యాదును వెనక్కి తీసుకుని ఉండొచ్చని సీజేఐ ఎస్ఏ బోబ్డే, జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ వి.రామసుబ్రమణియన్ లో కూడిన ధర్మాసనం అభిప్రాయపడింది.

ఇక వాదనలన్నీ పూర్తయిన పిమ్మట... అంతర్గత విచారణ జరిపే అధికారం మధ్యప్రదేశ్ హైకోర్టుకు ఉందని, ఆ మహిళా అధికారి తన ఫిర్యాదు ఉపసంహరించుకున్నప్పటికీ వాట్సాప్ లో ఆమెకు పంపిన సందేశాలు అసభ్యకరంగా ఉన్నాయని, ఎంతో బాధించేవిగా ఉన్నాయని ఎస్ఏ బోబ్డే స్పష్టం చేశారు. అంతేకాదు, రిటైర్డ్ జడ్జి న్యాయవాదికి వారం రోజుల సమయం ఇచ్చారు. సుప్రీంలో దాఖలు చేసిన పిటిషన్ వెనక్కి తీసుకునేలా రిటైర్డ్ జడ్జితో సంప్రదింపులు జరపాలని ఆదేశించారు.

More Telugu News