New Delhi: ఢిల్లీ బాంబు పేలుడులో ‘ఇరాన్’ హస్తం?

Iranian hand suspected in blast outside Israel embassy in Delhi letter says its a trailer
  • ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర లేఖను గుర్తించిన పోలీసులు
  • ఇరాన్ జనరల్ ఖాసీం, అణ్వస్త్ర శాస్త్రవేత్త ఫక్రీజాదె హత్యల ప్రస్తావన
  • ఖాసీంను విమాన దాడుల్లో చంపేసిన అమెరికా
  • శాటిలైట్ తుపాకీతో ఫక్రీజాదెను ఇజ్రాయెల్ చంపిందంటున్న ఇరాన్
ఢిల్లీలోని ఇజ్రాయెలీ ఎంబసీ ముందు జరిగిన బాంబు పేలుడులో ఓ కొత్త ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. పేలుడుకు ‘ఇరాన్’ లింకులున్నట్టు తెలుస్తోంది. ఇరాన్ కు చెందిన వ్యక్తే పేలుడుకు పాల్పడి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు. పేలుడు తర్వాత ఆ ప్రాంతమంతా గాలంచిన స్పెషల్ సెల్ పోలీసులకు ఓ లేఖ దొరికింది.

అందులో ‘ఇది జస్ట్ ట్రైలరే’ అని రాసి ఉన్నట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. గత ఏడాది దాడుల్లో చనిపోయిన ఇరాన్ జనరల్ ఖాసీం సోలెమనీ, ఆ దేశ అత్యున్నత అణ్వస్త్ర శాస్త్రవేత్త మోహ్సెన్ ఫక్రీజాదెల పేర్లను ఆ లేఖలో ప్రస్తావించినట్టు సమాచారం.

గత ఏడాది జనవరి 3న ట్రంప్ ఆదేశాలతో అమెరికా సైన్యం చేసిన విమాన దాడుల్లో బాగ్ధాద్ ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్టు వద్ద ఖాసీం చనిపోయారు. ఇరాన్ కు అత్యంత శక్తిమంతమైన మిలటరీ కమాండర్ గా ఖాసీంకు పేరు. ఇక, అదే ఏడాది నవంబర్ 27న.. శాటిలైట్ గన్ తో జరిపిన కాల్పుల్లో ఫక్రీజాదె చనిపోయారు. దీనికి కారణం ఇజ్రాయెల్ అని ఇరాన్ ఆరోపిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఢిల్లీలోని ఇజ్రాయెల్ ఎంబసీ దగ్గర దొరికిన లేఖ కలకలం రేపుతోంది. అయితే, శుక్రవారం జరిగిన పేలుడు అతి చిన్నదేనని, కార్ల అద్దాలు మాత్రమే పగిలిపోయాయని అధికారులు చెప్పారు. ఎవరికీ ఎలాంటి ప్రాణహాని కలగలేదని వివరించారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఉన్న అన్ని విమానాశ్రయాల వద్ద హై అలర్ట్ ప్రకటించారు.
New Delhi
Blast
Iran
Israel
USA

More Telugu News