england: చెన్నై విమానాశ్ర‌యానికి చేరుకున్న ఇంగ్లండ్ క్రికెట్ జ‌ట్టు

  • ఇంగ్లండ్‌తో 4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచులు
  • ఫిబ్ర‌వ‌రి 5 నుంచి చెన్నైలో ఇరు జ‌ట్ల మ‌ధ్య‌‌ తొలి టెస్టు మ్యాచు
  • శ్రీలంక నుంచి నేరుగా భార‌త్ వ‌చ్చిన ఇంగ్లండ్ జ‌ట్టు
England Cricket team and staff arrive at Chennai Airport

ఆసీస్‌తో ఇటీవ‌ల‌ జరిగిన టెస్ట్ సిరీస్‌లో విజయం సాధించి జోరు మీదున్న భార‌త్ త్వ‌ర‌లోనే ఇంగ్లండ్‌తో 4 టెస్టులు, 3 వ‌న్డేలు, 5 టీ20 మ్యాచులు ఆడ‌నుంది. ఫిబ్ర‌వ‌రి 5 నుంచి చెన్నైలో ఇరు జ‌ట్ల మధ్య తొలి టెస్టు మ్యాచు జ‌ర‌గ‌నుంది. ఈ నేప‌థ్యంలో ఇంగ్లండ్ జ‌ట్టు శ్రీలంక నుంచి చెన్నై ఎయిర్‌పోర్టుకి చేరుకుంది.  

విమానాశ్ర‌యంలో వారికి కరోనా ప‌రీక్ష‌లు చేశారు. భార‌త్-ఇంగ్లండ్ మ‌ధ్య‌ తొలి టెస్టు చెన్నైలోని చిదంబ‌రం స్టేడియంలో జ‌ర‌గ‌నుం‌ది. ఈ నేప‌థ్యంలో భార‌త క్రికెట‌ర్లు కూడా ఈ రోజు చెన్నై చేరుకుంటారు. ఇరు జ‌ట్ల ఆట‌గాళ్లు ఆరు రోజుల పాటు క్వారంటైన్‌లో ఉంటారు.  

కాగా, వ‌ర‌ల్డ్ టెస్ట్ చాంపియ‌న్‌షిప్‌లో భాగంగానే ఇంగ్లండ్‌- భార‌త్‌ మ‌ధ్య నాలుగు టెస్టు మ్యాచ్‌లు జ‌ర‌గ‌నున్నాయి. ఇంగ్లండ్ జ‌ట్టు కూడా బ‌లంగా ఉంది. శ్రీలంక‌తో ఇటీవ‌ల జ‌రిగిన రెండు టెస్టుల్లోనూ ఇంగ్లండ్ గెలిచింది. మ‌రోవైపు, భార‌త్ బ‌లంగానే ఉన్న‌ప్ప‌టికీ, జ‌ట్టును గాయాలబెడ‌ద బాధిస్తోంది.

More Telugu News