Australia: భారత ఆటగాళ్లపై జాతి విద్వేష వ్యాఖ్యలు నిజమే: విచారణ నివేదికలో క్రికెట్ ఆస్ట్రేలియా

  • సిడ్నీ టెస్టులో ఘటన
  • సిరాజ్ ను వేధించిన ఆసీస్ అభిమానులు
  • సీసీటీవీ ఫుటేజ్ పరిశీలిస్తున్నాం
  • విచారణ కొనసాగుతోందన్న క్రికెట్ ఆస్ట్రేలియా
Cricket Australia confirms racial abuse to Indian Players

భారత క్రికెట్ జట్టు సభ్యులపై కొందరు ఆస్ట్రేలియా పౌరులు జాతి విద్వేష వ్యాఖ్యలు చేసిన మాట వాస్తవమేనని బుధవారం నాడు క్రికెట్ ఆస్ట్రేలియా తన రిపోర్టులో అంగీకరించింది. ఈ విషయంలో ఇంకా విచారణ కొనసాగుతూనే ఉందని తెలిపింది. ఈ మేరకు క్రికెట్ ఆస్ట్రేలియా ఓ అధికారిక ప్రకటనను విడుదల చేసింది.

భారత ఆటగాళ్లను గేలి చేసిన మాట వాస్తవమేనని క్రికెట్ ఆస్ట్రేలియా ఇంటిగ్రిటీ అండ్ సెక్యూరిటీ విభాగం హెడ్ సీన్ కారోల్ వెల్లడించారు. ఈ విషయంలో తమ సొంత విచారణ కూడా సాగుతోందని, అందుబాటులోని సీసీటీవీ ఫుటేజ్ లను తాము క్షుణ్ణంగా పరిశీలిస్తున్నామని తెలిపారు. ఘటన జరిగిన మ్యాచ్ కి సంబంధించిన టికెట్ల విక్రయం వివరాలు కూడా సేకరించామన్నరు.

ఈ జాతి విద్వేష వ్యాఖ్యలకు కారకులెవరన్న విషయాన్ని తేల్చేందుకు సమీపంలో కూర్చుని ఉన్న ప్రేక్షకులను విచారిస్తున్నామని, ఏది ఏమైనా క్రికెట్ ఆస్ట్రేలియా యాంటీ హెరాస్ మెంట్ కోడ్ ఉల్లంఘన జరిగిందని ఇప్పటికే తేల్చామని, ఎన్ఎస్ డబ్ల్యూ పోలీసుల సహకారంతో నిందితులను గుర్తించి చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు.

కాగా, సిడ్నీలో ఇండియా, ఆస్ట్రేలియాల మధ్య మూడవ టెస్ట్ సందర్భంగా మహమ్మద్ సిరాజ్ ను, జస్ ప్రీత్ బుమ్రాను ఆసీస్ అభిమానులు కొందరు గేలి చేసిన సంగతి తెలిసిందే. ఈ విషయాన్ని కెప్టెన్ అజింక్య రహానే, మరికొందరు అంపైర్ దృష్టికి తీసుకుని వెళ్లారు. దీంతో ఫిర్యాదును నమోదు చేసిన ఐసీసీ పలువురిని ప్రశ్నించింది.

More Telugu News