Crows: మధ్యప్రదేశ్ లో బర్డ్ ఫ్లూ కలకలం... గుట్టలు గుట్టలుగా చచ్చిపడుతున్న కాకులు!

  • నేల రాలుతున్న కాకులు
  • వారం రోజుల వ్యవధిలో వందల కాకుల మృతి
  • నమూనాలను ప్రయోగశాలకు పంపిన అధికారులు
  • ఏవియన్ ఫ్లూ అని తేలిన వైనం
Huge number of crows dies in Madhya Pradesh

అసలే కరోనా రక్కసితో కుదేలైన భారత్ లో మరో కలకలం బయల్దేరింది. మధ్యప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో బర్డ్ ఫ్లూ వ్యాప్తి చెందుతున్నట్టు గుర్తించారు. మూడు జిల్లాల్లో వారం రోజుల వ్యవధిలోనే వందల సంఖ్యలో కాకులు మరణించడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. చనిపోయిన కాకుల నుంచి నమూనాలు సేకరించి భోపాల్ లోని హైసెక్యూరిటీ యానిమల్ డిసీజ్ లాబొరేటరీ (హెచ్ఎస్డీఎల్)కి పంపారు. కాగా, ఇండోర్ ప్రాంతం నుంచి పంపిన కాకుల నమూనాల్లో ఏవియన్ ఫ్లూ (హెచ్5ఎన్8)ను గుర్తించారు. మరికొన్ని ప్రాంతాల నుంచి పంపిన నమూనాల తాలూకు ఫలితాలు రావాల్సి ఉంది.

ఒక్క ఇండోర్ లోనే ఓ కాలేజి వద్ద 145 కాకులు చచ్చిపడి ఉండడం స్థానికులను భయభ్రాంతులకు గురిచేసింది. మందసౌర్ ప్రాంతంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. అక్కడ గడచిన 3 రోజుల వ్యవధిలో 200 కాకులు విగతజీవుల్లా మారిపోయాయి. ఖర్గోనే జిల్లాలోని కస్రావాడ్ ప్రాంతంలో రెండ్రోజుల్లో 20 కాకులు మృతి చెందాయి. దీనిపై వెటర్నరీ వర్గాలు, అటవీశాఖ సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే ఏవియన్ ఫ్లూ మనుషులకు సోకినట్టు ఎక్కడా వెల్లడి కాలేదు.

More Telugu News