Crime News: సూర్యాపేటలో దారుణం.. తల్లిదండ్రుల ఫొటోలకు చెప్పుల దండ వేసిన కుమారులు

  • భూమి కోసం వేధింపులు
  • తండ్రిని కిడ్నాప్ చేసిన తనయులు 
  • బలవంతంగా భూమిని రాయించుకున్న వైనం   
  • ఇద్దరు కుమారుల అరెస్టు

వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులను కంటికిరెప్పలా చూసుకోవాల్సిన కుమారులు కనీసం వారిని పట్టించుకోకపోవడమే కాకుండా, వారిని వేధిస్తూ, మరింత రెచ్చిపోయి ఘోరంగా అవమానించారు. తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పులదండ వేశారు. ఆ ఫొటోను కుటుంబ వాట్సాప్‌ గ్రూప్‌లో షేర్ చేశారు.

తండ్రిని కిడ్నాప్‌ చేసి ఆయనతో బలవంతంగా భూమిని తమ పేరిట రిజిస్ట్రేషన్‌ చేయించుకున్నారు. సూర్యాపేట పట్టణంలోని భగత్‌సింగ్‌ నగర్‌లో ఈ దారుణ ఘటన చోటు చేసుకుంది. నూనె సంజీవరావు, నూనె సరోజ దంపతులకు నలుగురు కుమారులు, ఒక కూతురు ఉన్నారు. రెండో కుమారుడు అనారోగ్యంతో గతంలో మృతి చెందాడు.

పెద్ద కుమారుడు రవీందర్, మూడో కుమారుడు దయాకర్‌లు ప్రభుత్వ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. నాలుగో కుమారుడు ప్రశాంత్‌ ప్రైవేట్‌ ఉద్యోగం చేస్తున్నాడు. సంజీవరావుకు యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలం పల్లివాడలో ఐదు ఎకరాల భూమి ఉండగా దాని విషయంలో తండ్రితో కుమారులు రవీందర్, దయాకర్‌లు కొంతకాలంగా గొడవ పడుతున్నారు.

ఈ నేపథ్యంలో తల్లిదండ్రుల చిత్రపటానికి చెప్పుల దండ వేశారు. ప్రైవేటు ఉద్యోగాలు చేసుకుంటూ ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమ నాలుగో కుమారుడికి తాము సాయం చేస్తుంటే తమపై మిగతా ఇద్దరు కుమారులు దాడులకు పాల్పడుతున్నారని తల్లి సరోజ తెలిపారు. తన భర్త సంజీవరావును కిడ్నాప్‌ చేశారని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది.

నిందితులు తాము చేసిన నేరాన్ని అంగీకరించారు. అయితే, తనను కుమారులు కిడ్నాప్ చేయలేదని తండ్రి చెప్పడం గమనార్హం. నిందితులను పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

More Telugu News