Kishan Reddy: పూర్తిగా సహకరిస్తామని పవన్ కల్యాణ్ చెప్పారు: కిషన్ రెడ్డి

  • జీహెచ్ఎంసీ బరి నుంచి తప్పుకున్న జనసేన
  • బీజేపీకి పూర్తి మద్దతు ప్రకటించిన పవన్ కల్యాణ్
  • రెండు పార్టీలు భవిష్యత్తులో కూడా కలిసి పనిచేస్తాయన్న కిషన్ రెడ్డి
BJP and Janasena will work together in future also says Kishan Reddy

జీహెచ్ఎంసీ ఎన్నికల బరి నుంచి జనసేన తప్పుకున్న సంగతి తెలిసిందే. జనసేన నేత నాదెండ్ల మనోహర్ నివాసంలో ఈ మధ్యాహ్నం జనసేనాని పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, బీజేపీ సీనియర్ నేత లక్ష్మణ్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రేటర్ ఎన్నికలపై వీరు చర్చించారు. అనంతరం జీహెచ్ఎంసీ ఎన్నిల నుంచి జనసేన తప్పుకుంటున్నట్టు పవన్ కల్యాణ్ ప్రకటించారు. జనసైనికులంతా బీజేపీకి పూర్తిగా సహకరించాలని పిలుపునిచ్చారు.

ఈ భేటీ అనంతరం మీడియాతో కిషన్ రెడ్డి మాట్లాడుతూ, బీజేపీకి జనసేన మద్దతివ్వడం సంతోషకరమని అన్నారు. బీజేపీతో కలిసిరావాలని పవన్ కల్యాణ్ ను కోరామని, పూర్తిగా సహకరిస్తామని పవన్ చెప్పారని తెలిపారు. జీహెచ్ఎంసీ ఎన్నికలలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రజలు మార్పు కోరుకుంటున్నారని చెప్పారు. గ్రేటర్ ఎన్నికల్లో మాత్రమే కాకుండా భవిష్యత్తులో కూడా రెండు పార్టీలు కలిసి పని చేస్తాయని అన్నారు. బీజేపీతో జనసేన కలిసి ఉంటే... ప్రజల కలలన్నీ నెరవేరుతాయని చెప్పారు.

More Telugu News