Girl: ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు... నాకంటే నీకు ముఖ్యమైన వాళ్లున్నారు బావా అంటూ అమ్మాయి సూసైడ్

  • మెదక్ జిల్లాలో విషాద ఘటన
  • బావను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి
  • పెళ్లయిన ఆర్నెల్లకే బలవన్మరణం
Girl committed suicide after six months of marriage

మెదక్ జిల్లా కొల్చారంలో విషాద ఘటన చోటుచేసుకుంది. బావను ప్రేమించి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఆర్నెల్లకే ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలచివేసింది. కొల్చారం ఉప సర్పంచి నింగొల్ల లక్ష్మి, చెన్నయ్య దంపతుల కుమార్తె నవనీత (19)... తన దూరపు బంధువు ప్రశాంత్ ను ప్రేమించింది. నవనీతకు ప్రశాంత్ వరుసకు బావ అవుతాడు. వారి ప్రేమ ఇరు కుటుంబాల మధ్య విభేదాలకు కారణమైంది.

అయితే, కుటుంబ సభ్యులను ఎలాగో ఒప్పించి నవనీత, ప్రశాంత్ పెళ్లితో ఒక్కటయ్యారు. వారి పెళ్లి జరిగిన ఆర్నెల్లకే నవనీత ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. నవనీత రాసిన సూసైడ్ నోట్ లో ఆసక్తికర అంశాలు ఉన్నాయి. "హాయ్ బావా... నేనంటే నీకు పెద్దగా ఇష్టం లేనట్టుంది. నాకంటే నీకు చాలామంది ముఖ్యమైన వాళ్లున్నారు. నాకు ఓడిపోవాలని లేదు బావా.. అయినా ఈ రోజు నా చావు కబురు వింటావు. బై బావా.. సంతోషంగా ఉండు. ఐ లవ్యూ  బావా" అంటూ పేర్కొంది.

దీనిపై నవనీత తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన కుమార్తె గత ఫిబ్రవరిలోనే పెళ్లి చేసుకుందని, ప్రశాంత్ తో కాపురంలో ఆమె రెండు నెలలు మాత్రమే సంతోషంగా గడిపిందని తెలిపారు. ఆ తర్వాత అత్తమామలు కట్నం కోసం వేధించడం మొదలుపెట్టారని వివరించారు. ఈ కారణంగానే తన కుమార్తె మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిందని పేర్కొన్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

More Telugu News