Chidambaram: కరోనాను ఓడించడంలో భారత్ ఎందుకు విఫలమైందో మోదీ సమాధానం చెప్పాలి: చిదంబరం

  • ఈ నెలాఖరుకు కరోనా కేసులు 55 లక్షలకు చేరుకుంటాయని చెప్పారు
  • కానీ అవి 65 లక్షలకు చేరుకుంటాయి
  • దీనిపై మోదీ సమాధానం చెప్పాలి
India is the only country not benefited with lockdown says Chidambaram

భారత్ లో కరోనా కేసులు భారీ సంఖ్యలో పెరుగుతున్న నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం విమర్శలు గుప్పించారు. లాక్ డౌన్ ప్రకటించినా కరోనా కేసులు కట్టడి కాలేదని అన్నారు. లాక్ డౌన్ నుంచి ప్రయోజనం పొందలేని ఏకైక దేశం ఇండియానే అని విమర్శించారు. ఇండియాలో కరోనా కేసుల సంఖ్య 40 లక్షలకు చేరుకున్నట్టు కేంద్ర ఆరోగ్యశాఖ ప్రకటించిన నేపథ్యంలో చిదంబరం మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.

సెప్టెంబర్ 30 నాటికి దేశంలో కరోనా కేసుల సంఖ్య 55 లక్షలకు చేరుతుందని తాను అంచనా వేశానని... అయితే తన అంచనా తప్పు అని చిదంబరం చెప్పారు. సెప్టెంబర్ చివరికి కేసుల సంఖ్య 65 లక్షలకు చేరుకుంటుందని తెలిపారు.

21 రోజుల్లో కరోనాను ఓడిస్తామని ప్రధాని మోదీ చెప్పారని... ఇప్పుడు భారత్ ఎందుకు విఫలమైందో ప్రజలకు మోదీ సమాధానం చెప్పాలని చిదంబరం డిమాండ్ చేశారు. దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని విమర్శించారు. ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో తిరోగమన వృద్ధిరేటుపై ఆర్థిక మంత్రి నిర్మలాసీతారామన్ వివరణ ఇవ్వాలని అన్నారు.

More Telugu News