APSRTC: తెలుగు రాష్ట్రాల మధ్య బస్సులు... టీఎస్ కు కీలక ప్రతిపాదన చేసిన ఏపీ!

  • 1.12 లక్షల కిలోమీటర్లు తగ్గించుకోవాలన్న టీఎస్
  • 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామన్న ఏపీ
  • ఆ మేరకు టీఎస్ సర్వీసులు పెంచుకోవచ్చని సూచన
AP Praposal to TS Over Interstate Buses

ఆంధ్రప్రదేశ్ విడిపోయిన తరువాత, తెలంగాణ నుంచి ఏపీకి తిరిగే బస్సుల సంఖ్యతో పోలిస్తే, ఏపీ నుంచి తెలంగాణకు వచ్చే బస్సుల సంఖ్యే అధికంగా ఉండేదన్న సంగతి తెలిసిందే. కరోనా కారణంగా బస్సులు ఆగిపోయిన తరువాత, తిరిగి పునరుద్ధరించాలన్న ఆలోచనలో రెండు రాష్ట్రాలూ ఉన్నప్పటికీ, సమాన కిలోమీటర్ల మేరకు బస్సులను తిప్పేలా అంతర్రాష్ట్ర ఒప్పందం కుదుర్చుకోవాలని టీఎస్ భావిస్తోంది. ఈ మేరకు ఇప్పటికే ప్రతిపాదనలను సిద్ధం చేస్తూ, ఏపీఎస్ ఆర్టీసీ బస్సులు 1.12 లక్షల కిలోమీటర్లు అధికంగా తిరుగుతున్నాయని, ఆ మేరకు తగ్గించుకోవాలని టీఎస్ ఆర్టీసీ అధికారులు కోరారు.

ఈ నేపథ్యంలో ఏపీ రవాణా శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి టీఎస్ ఆర్టీసీ ఉన్నతాధికారులకు లేఖ వచ్చింది. తాము 56 వేల కిలోమీటర్లు తగ్గించుకుంటామని, ఆ మేరకు తెలంగాణ బస్సు సర్వీసులను పెంచుకోవాలని ఈ లేఖలో ప్రతిపాదించారు. దీనిపై వెంటనే చర్చించి, బస్సులను నడిపిద్దామని ఈ లేఖలో రవాణా శాఖ చీఫ్ సెక్రెటరీ ఎంటీ కృష్ణబాబు సూచించారు. దీనిపై ఇంకా టీఎస్ ఆర్టీసీ అధికారులు స్పందించలేదు.

More Telugu News