UAE: యూఏఈలో పెరుగుతున్న కరోనా కేసులు... ఐపీఎల్ సజావుగా సాగేనా..?

  • కరోనా కారణంగా యూఏఈకి మారిన ఐపీఎల్ వేదిక
  • సెప్టెంబరు 19న లీగ్ ప్రారంభం
  • అప్పటికి యూఏఈలో కరోనా కేసులు పెరిగే అవకాశం!
IPL host UAE witnesses more corona cases

అంతర్జాతీయ స్టార్లతో, రక్తి కట్టించే లీగ్ మ్యాచ్ లతో ఐపీఎల్ అందించే క్రికెట్ వినోదం అంతాఇంతా కాదు. ప్రతి మ్యాచ్ ఓ ఫైనల్ లా అభిమానులను అలరించడం ఐపీఎల్ లోనే చూడొచ్చు. అయితే ఈ సీజన్ భారత్ నుంచి యూఏఈ గడ్డపైకి తరలివెళ్లింది. అందుకు కారణం కరోనా. భారత్ లో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని ఐపీఎల్ 13వ సీజన్ ను యూఏఈలో నిర్వహించాలని బీసీసీఐ నిర్ణయించింది. ఇప్పటికే ప్రారంభ, ముగింపు తేదీలు కూడా ఖరారయ్యాయి.

ఈ నేపథ్యంలో ఐపీఎల్ పాలకమండలి, బీసీసీఐని కలవర పరిచేలా యూఏఈలో కరోనా వ్యాప్తి ఊపందుకుంది. ఇటీవల కొన్నిరోజులుగా ఇక్కడ నిత్యం వందల్లో కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. ఐపీఎల్ సెప్టెంబరు 19న ప్రారంభం కావాల్సి ఉండగా, అప్పటికి యూఏఈలో కరోనా ప్రభావం అధికమయ్యే అవకాశాలున్నాయని భావిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో ఐపీఎల్ మ్యాచ్ ల నిర్వహణ ఎలా అన్నది బోర్డు వర్గాలను కలవరపాటుకు గురిచేస్తున్నాయి.

ఐపీఎల్ కు సన్నద్ధమయ్యేందుకు తక్కువ సమయం ఉండడంతో చాలా ఫ్రాంచైజీలు వీలైనంత త్వరగా యూఏఈ వెళ్లాలని భావిస్తున్నాయి. మరో వారం రోజుల్లో అన్ని జట్లు యూఏఈ గడ్డపై కాలుమోపనున్నాయి. ఈ క్రమంలో ఐపీఎల్ ప్రారంభం నాటికి ఆటగాళ్లను వైరస్ బారినపడకుండా కాపాడుకోవడం ఫ్రాంచైజీల యాజమాన్యాలకు అగ్నిపరీక్ష అనడంలో సందేహం లేదు.

More Telugu News