Andhra Pradesh: అనారోగ్యంతో మరణించిన భార్య.. తట్టుకోలేక ఆగిన భర్త గుండె

  • ఏపీలోని రాజమహేంద్రవరంలో  ఘటన
  • ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మరణించిన భార్య
  • ఆమె మృతదేహాన్ని చూసి కుప్పకూలి మరణించిన భర్త
wife and husband dead in a same time in Rajamahendravaram

భార్య మరణాన్ని తట్టుకోలేక భర్త గుండె ఆగిన విషాద ఘటన ఇది. రాజమహేంద్రవరంలోని బొమ్మూరు వెంకటేశ్వరనగర్-2లో జరిగిందీ ఘటన. స్థానికంగా నివసించే చిరంజీవి రామచంద్రరాజు (50) ఓ దినపత్రికలో సబ్ ఎడిటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన భార్య నాగలక్ష్మి (45) ఇటీవల అనారోగ్యం పాలైంది. ఐదు రోజుల క్రితం ఆమె తండ్రి మరణించిన తర్వాత నాగలక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించింది. ఇటీవల రామచంద్రరాజు కూడా అస్వస్థతకు గురికావడంతో శుక్రవారం ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్లి చూపించుకున్నారు.

అయితే, శనివారం తెల్లవారుజామున నాగలక్ష్మి ఆరోగ్యం మరింత క్షీణించడంతో ఆమె సోదరుడు ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలోనే నాగలక్ష్మి ప్రాణాలు విడిచింది. దీంతో ఆమె మృతదేహాన్ని తిరిగి ఇంటికి తీసుకొచ్చారు. భార్య మృతదేహాన్ని చూసిన రామచంద్రరాజు తట్టుకోలేక అక్కడికక్కడే కుప్పకూలి ప్రాణాలొదిలాడు. భార్యాభర్తలు ఇద్దరూ ఒకేసారి మృతి చెందడంతో కుటుంబంలో విషాదం అలముకుంది.

More Telugu News