Shoaib Akhtar: టీమిండియా క్రికెటర్లపై చవకబారు వ్యాఖ్యలు చేసిన షోయబ్ అక్తర్

  • తన బౌలింగ్ అంటే భయపడేవాళ్లని వెల్లడి
  • భార్యాపిల్లలున్నారని చెప్పేవాళ్లని వ్యాఖ్యలు
  • ఓ క్రికెట్ వ్యాఖ్యాతకు ఇంటర్వ్యూ ఇచ్చిన అక్తర్
Shoaib Akhtar comments on Indian tailenders

భారత క్రికెటర్లంటే ఎంతో చులకనగా మాట్లాడడం పాకిస్థాన్ ఆటగాళ్లకు అలవాటే! మాజీ స్పీడ్ స్టర్ షోయబ్ అక్తర్ కూడా అందుకు మినహాయింపు కాదు. తాజాగా షోయబ్ అక్తర్ చేసిన వ్యాఖ్యలు అతిశయోక్తులను తలపించేలా ఉన్నాయి. తన బౌలింగ్ గురించి గొప్పగా చెప్పుకుంటూ...తాను బౌలింగ్ కే వచ్చానంటే టీమిండియా చివరి వరుస బ్యాట్స్ మెన్ హడలిపోయేవారని తెలిపాడు.

"కావాలంటే అవుట్ చేసుకో... కానీ మా శరీరాలకు తగిలేలా బంతులు విసరొద్దు. మేం భార్యాపిల్లలు కలవాళ్లం. మా తల్లిదండ్రులు మాకు తగిలిన గాయాలు చూసి తట్టుకోలేరు అని టీమిండియా క్రికెటర్లు చెప్పేవాళ్లు. ఇలాంటి ఘటనలు చాలానే జరిగాయి" అని అక్తర్ వివరించాడు. క్రికెట్ వ్యాఖ్యాత సవేరా పాషాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ వ్యాఖ్యలు చేశాడు. కౌంటీల్లో ఓసారి ఓ ఇంగ్లీష్ బ్యాట్స్ మన్ తనతో అడిగి మరీ బౌలింగ్ చేయించుకుని దవడ పగలగొట్టుకున్నాడని అక్తర్ చెప్పుకొచ్చాడు. తాను విసిరిన బంతి తగిలి వికెట్లమీద పడిపోయాడని, చచ్చిపోయాడనే భావించానని పేర్కొన్నాడు.

More Telugu News