Cow Dung: పేడే కదా అని చులకనగా చూడకండి.. గొప్ప కార్యక్రమాన్ని ప్రారంభించిన చత్తీస్ గఢ్!

  • గ్రామీణులకు అండగా కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించిన చత్తీస్ గఢ్ ప్రభుత్వం
  • వర్మీ కంపోస్ట్ తయారీలో పేడను వినియోగించనున్న వైనం
  • గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందన్న సీఎం
Chhattishgarh govt to buy cow dung

పేడే కదా అని చులకనగా చూడకండి. పేడ కూడా మీకు ఆర్థికంగా అండగా ఉండే రోజులు రాబోతున్నాయి. మన దేశంలో చత్తీస్ గఢ్ లో పేడ కొనుగోలుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. రాబోయే రోజుల్లో మన తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టినా ఆశ్చర్యం లేదు. పశు సంపదపై ఆధారపడే గ్రామీణులకు అండగా నిలిచేందుకు చత్తీస్ గఢ్ ప్రభుత్వం 'గోధన్ న్యాయ్' పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా కిలో పేడను రూ. 1.50కి కొనుగోలు చేయనుంది. ఈ పథకం ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు చేసే పేడను వర్మీ కంపోస్ట్ తయారీలో వినియోగించనుంది.

ఈ సందర్భంగా ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి భూపేశ్ భాగేల్ మాట్లాడుతూ, ఈ పథకం ద్వారా గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడుతుందని తెలిపారు. స్వయం సహాయక బృందాల్లోని మహిళలు ఇంటింటికీ వెళ్లి పేడను సేకరిస్తారని చెప్పారు. ఈ పథకం కోసం ఓ కార్డును జారీ చేస్తామని... పేడ కొనుగోలు తేదీ, వివరాలను ఇందులో నమోదు చేస్తామని తెలిపారు. ఈ పథకాన్ని పర్యవేక్షించేందుకు గ్రామ స్థాయిలో గోధన్ కమిటీలను ఏర్పాటు చేయనున్నామని చెప్పారు. పట్టణాలు, నగరాల్లో ఈ కార్యక్రమాన్ని పురపాలక సంఘాలు పర్యవేక్షిస్తాయని తెలిపారు.

More Telugu News