Marriage: పెళ్లి ద్వారా 15 మందికి కరోనా.. వరుడి కుటుంబానికి రూ. 6 లక్షల జరిమానా

  • రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో ఘటన
  • ఐసోలేషన్, ఆహారం, అంబులెన్స్ ఖర్చులకు రూ.6,26,600
  • ఆ మొత్తాన్ని వరుడి కుటుంబం నుంచి వసూలు చేయాలని కలెక్టర్ ఆదేశం
Collector slapped Rs 6 lakh fine for allegedly spread covid

కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించి 15 మందికి కరోనా సోకడానికి కారణమైన ఓ కుటుంబానికి అధికారులు ఏకంగా 6 లక్షల రూపాయలు జరిమానా విధించారు. రాజస్థాన్‌లోని భిల్వారా జిల్లాలో జరిగిందీ ఘటన. జిల్లాకు చెందిన గీసులాల్ రాఠీ ఈ నెల 13న తన కుమారుడికి వివాహం జరిపించాడు.

కరోనా కారణంగా పెళ్లికి 50 మంది అతిథులు మాత్రమే పాల్గొనేందుకు అనుమతి ఉండగా, నిబంధనలు పక్కనపెట్టి గీసులాల్ ఈ పెళ్లికి పెద్ద సంఖ్యలో అతిథులను ఆహ్వానించాడు. వివాహానికి హాజరైన వారిలో 15 మందికి మహమ్మారి సోకినట్టు ఆ తర్వాత నిర్ధరణ అయింది. వీరిలో ఒకరు చనిపోయారు కూడా. ఈ ఘటనను తీవ్రంగా పరిగణించిన పోలీసులు ఈ నెల 22న గీసులాల్‌పై కేసు నమోదు చేశారు.

మరోవైపు, కరోనా సోకిన వారిని ప్రభుత్వ ఐసోలేషన్ కేంద్రాలకు తరలించి చికిత్స అందించారు. వీరికి కరోనా పరీక్షల నిర్వహణ, చికిత్స, ఆహారం, అంబులెన్స్‌ తదితర వాటికి మొత్తంగా రూ.6,26,600 అయింది. దీంతో ఈ మొత్తాన్ని గీసులాల్ కుటుంబం నుంచి వసూలు చేయాలని నిర్ణయించిన కలెక్టర్ రాజేంద్ర భట్ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఆ మొత్తాన్ని వసూలు చేసి  ముఖ్యమంత్రి సహాయనిధిలో డిపాజిట్ చేయాలని సూచించారు.

More Telugu News