Chandrababu: పాలనలో తనదైన ముద్ర వేయడం అంటే వైసీపీ పాలకుల అర్థాలే వేరు: చంద్రబాబు

  • ఏడాది వైసీపీ పాలన నిర్వాకాల మయం అంటూ వ్యాఖ్యలు
  • రైతులను మోసం చేస్తున్నారని ఆరోపణ
  • ఇచ్చినట్టే ఇచ్చి లాక్కుంటారని ఆగ్రహం
Chandrababu comments on YSRCP rulers

టీడీపీ అధినేత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. పాలనలో తనదైన ముద్రవేయడం అంటే వైసీపీ పాలకుల అర్థాలే వేరు అంటూ ఎద్దేవా చేశారు. టీడీపీ పథకాలకు వైసీపీ పేర్లు పెట్టుకోవడం, టీడీపీ నిర్మించిన భవనాలకు వైసీపీ రంగులు వేసుకోవడం, స్కీములు రద్దు చేయడం, మసిపూసి మారేడుకాయ చేయడం... ఏడాది కాలంగా వైసీపీ పాలనలో సాగిన నిర్వాకాలు ఇవేనని వెల్లడించారు. అధికారంలోకి వచ్చిన వెంటనే 36కి పైగా టీడీపీ పథకాలను రద్దు చేశారని, కొన్ని పథకాలకు పేర్లుమార్చి వైసీపీ స్టిక్కర్లు వేసుకున్నారని ఆరోపించారు.

పాత రుచి, కొత్త రంగు.. ఇదే వైసీపీ మాయాజాలం అని, అన్నదాత సుఖీభవ పథకాన్ని రైతు భరోసాగా చేయడమే వైసీపీ మోసాలకు సాక్ష్యమని విమర్శించారు. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి రూ.12,500 ఇస్తామని చెప్పి అందులో రూ.6 వేలు ఎగ్గొట్టారని చంద్రబాబు పేర్కొన్నారు. అన్నదాత సుఖీభవ పథకం, 4,5వ విడతల రుణమాఫీతో ప్రతి రైతుకు రూ.1.10 లక్షలు వచ్చేవని, కానీ రైతు భరోసా ముసుగులో ఒక్కోరైతుకు రూ.75 వేల మేర మోసం చేశారని చంద్రబాబు ఆరోపించారు. ఇచ్చినట్టే ఇచ్చి లాక్కోవడం మోసగాళ్ల పాలనకు నిదర్శనమని విమర్శించారు.

ఎప్పుడో చనిపోయిన వైఎస్ వల్లే కియా మోటార్స్ వచ్చిందని చెబుతున్నారని, 8 ఏళ్ల నాటి సున్నా వడ్డీ పథకాన్ని కూడా తామే తెచ్చామని చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. పరుల కష్టానికి వైసీపీ కబ్జా స్టిక్కర్ అంటే ఇదేనని వ్యంగ్యం ప్రదర్శించారు.

More Telugu News