Nepal: తోక జాడిస్తున్న నేపాల్.. భారత్‌లోని ప్రాంతాలు మావే అంటూ పార్లమెంటులో తీర్మానం!

  • చైనా ప్రోత్సాహంతో కాలు దువ్వుతున్న నేపాల్
  • భారత్ లోని ప్రాంతాలను మళ్లీ స్వాధీనం చేసుకుంటామని వ్యాఖ్య
  • నేపాల్ తీరు సరి కాదన్న భారత్

చిరకాలంగా భారత్ కు మిత్ర దేశంగా ఉన్న నేపాల్... ఇప్పుడు తోక జాడిస్తోంది. చైనా ఉచ్చులో పడి భారత్ తో కాలు దువ్వేందుకు యత్నిస్తోంది. సరిహద్దు వివాదాలపై చీటికిమాటికి రచ్చ చేసేందుకు యత్నిస్తోంది. తాజా వివాదంలోకి వెళ్తే... జమ్మూకశ్మీర్ ను రెండు కేంద్రపాలిత ప్రాంతాలుగా విభజించిన తర్వాత భారత్ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ మ్యాప్ లో మన భూభాగంలో సరిహద్దు ప్రాంతాలైన కాలాపానీ, లిపులెక్, లింపియధుర ఉన్నాయి. అయితే ఇవి తన భూభాగాలని నేపాల్ వాదిస్తోంది. అంతేకాదు, ఇదే అంశంపై పార్లమెంటులో నేపాల్ తీర్మానం చేసింది.

ఈ ప్రాంతలు తొలి నుంచి భారత్ అంతర్భాగాలుగానే ఉన్నాయి. అయితే పాకిస్థాన్ కు అనుకూలంగా ఉండే చైనా... ఇప్పుడు నేపాల్ ను కూడా భారత్ కు వ్యతిరేకంగా దువ్వుతోంది. ఆ దేశ ప్రోత్సాహంతోనే భారత్ పై నేపాల్ కాలు దువ్వుతోంది. భారత్ లోని కొన్ని ప్రాంతాలను తమ ప్రాంతాలుగా చూపుతూ కొత్త మ్యాప్ ను విడుదల చేసింది. ఈ సందర్భంగా నేపాల్ ప్రధాని కేపీ శర్మ మాట్లాడుతూ, భారత్ అధీనంలో ఉన్న ప్రాంతాలు తమవేనని చెప్పారు. దౌత్య మార్గాల ద్వారా భారత్ ను ఒప్పించి ఆ ప్రాంతాలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని అన్నారు.

మరోవైపు నేపాల్ తీరును భారత్ తప్పుపట్టింది. నేపాల్ తీరు తమకు ఆమోదయోగ్యం కాదని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాలన్నీ తమవేనని చెప్పింది. అమెరికా కూడా ఈ అంశంపై స్పందించింది. భారత్ సరిహద్దు అంశంపై చైనా వ్యవహరిస్తున్న తీరు సమర్థనీయంగా లేదని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలో, రానున్న రోజుల్లో ఈ అంశం ఎన్ని మలుపులు తిరగబోతోందో వేచి చూడాలి.

More Telugu News