Madhya Pradesh: చొక్కాలు చింపి పారిశుద్ధ్య కార్మికులపై దాడి చేసిన వైనం

  • మధ్యప్రదేశ్‌లో ఘటన
  • హత్యాయత్నం కేసు నమోదు
  • ఒకరి అరెస్టు
  • గొడ్డలి తగలడంతో ఒకరికి తీవ్రగాయాలు
Madhya Pradesh Sanitation Worker Attacked Clothes Ripped

కరోనా మహమ్మారిని సైతం లెక్క చేయకుండా పని చేస్తోన్న వారిపై కొందరు దాడులకు పాల్పడుతుండడం కలకలం రేపుతోంది. అలా పారిశుద్ధ్య కార్మికులపై కొందరు దాడికి దిగిన ఘటన మధ్యప్రదేశ్‌లోని దెవాస్ జిల్లాలో చోటు చేసుకుంది. వీధుల్లో చెత్తను శుభ్రం చేయడానికి కొందరు పారిశుద్ధ్య కార్మికులు వెళ్లారు.

వారిని చూసిన ఓ మూక వారివద్దకు కర్రలు, గొడ్డళ్లతో వచ్చి దాడి చేసింది. వారి చొక్కాలను చించేసి, ఇష్టం వచ్చినట్లు కొట్టారు. ఒక పారిశుద్ధ్య కార్మికుడికి గొడ్డలి తగలడంతో తీవ్రగాయాలయ్యాయి. వారి దాడి నుంచి రక్షించే వారే లేక ఆ పారిశుద్ధ్య కార్మికులు నిస్సహాయంగా దెబ్బలు తింటూనే ఉండిపోయారు.

ఓ పారిశుద్ధ్య కార్మికుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడని అధికారులు చెప్పారు. ఈ కేసులో అదిల్ అనే ఓ వ్యక్తిని అరెస్టు చేశామని, అతడి సోదరుడి కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు. 'కోయ్లా మొహల్లా ప్రాంతంలో పారిశుద్ధ్య కార్మికులు పనిచేస్తోన్న సమయంలో అదిల్‌ అనే వ్యక్తి కొందరితో వచ్చి దీపక్‌తో పాటు పలువురు కార్మికులపై దాడి చేశాడు. అతడిపై హత్యాయత్నం కేసు నమోదు చేశాము' అని పోలీసులు తెలిపారు. కాగా, మధ్యప్రదేశ్‌లో 1,130 మందికి కరోనా సోకింది.

More Telugu News