Rayapati Sambasiva Rao: కమ్మవాళ్లు తలుచుకుంటే జగన్ లేచిపోతారని నేను అనలేదు: రాయపాటి సాంబశివరావు వివరణ

My comments on Jagan not correct says Rayapati Sambasiva Rao
  • కమ్మవారిపై ద్వేషం మంచిది కాదని చెప్పా
  • అన్ని కులాలను కలుపుకుపోవాలని సూచించాను
  • రాత్రి నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయి
ముఖ్యమంత్రి జగన్ పై టీడీపీ నేత, మాజీ ఎంపీ రాయపాటి సాంబశివరావు తీవ్ర విమర్శలు గుప్పించారంటూ మీడియాలో కథనాలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈ అంశంపై రాయపాటి క్లారిటీ ఇచ్చారు. కమ్మవారు తలుచుకుంటే జగన్ లేచిపోతారని తాను అన్నట్టు వస్తున్న వార్తల్లో నిజం లేదని ఆయన అన్నారు. తన వ్యాఖ్యలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని చెప్పారు. కమ్మవారిపై ద్వేషం మంచిది కాదంటూ జగన్ కు తాను సలహా ఇచ్చానని... అన్ని కులాలను కలుపుకుని వెళ్లాలని చెప్పానని తెలిపారు. జగన్ పై వ్యక్తిగతంగా తనకు ఎలాంటి ద్వేషం లేదని... ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి తనకు మంచి సన్నిహితుడని చెప్పారు.

ఫ్యాక్షన్ రాజకీయాలకు తొలి నుంచి తాను దూరమని రాయపాటి అన్నారు. తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం కావడంతో... రాత్రి నుంచి తనకు వందలాది బెదిరింపు కాల్స్ వస్తున్నాయని చెప్పారు. సోషల్ మీడియాలో అసభ్యకరంగా కామెంట్లు పెడుతున్నారని అన్నారు. పది కాలాల పాటు సీఎంగా కొనసాగాలంటే జగన్ అందరినీ కలుపుకుని పోవాల్సిందేనని... లేకపోతే ప్రజా వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి వస్తుందని చెప్పారు.
Rayapati Sambasiva Rao
Telugudesam
Jagan
YSRCP
Kamma

More Telugu News