Chidambaram: ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు కూడా ప్రజల మాట వినాలి: మోదీకి చిదంబరం హితవు

  • ఏప్రిల్ 5 రాత్రి దీపాలు వెలిగించాలన్న ప్రధాని
  • ప్రజలను నిరాశకు గురిచేశారన్న చిదంబరం
  • దేశం కోలుకునేందుకు అవసరమైన చర్యలు ఏవీ? అంటూ అసంతృప్తి
Chidambaram says Centre should listen people

ఏప్రిల్ 5వ తేదీ రాత్రి 9 గంటలకు దీపాలు వెలిగించి కరోనాపై సమైక్యపోరుకు సంకల్పాన్ని చాటాలంటూ ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత పి.చిదంబరం స్పందించారు. ప్రజలు మీ మాట వినడమే కాదు, మీరు కూడా ప్రజలు చెప్పే మాటలు వినాలని హితవు పలికారు.

"మీరు చెప్పినట్టే ఏప్రిల్ 5వ తేదీన దీపాలు వెలిగిస్తాం, అందుకు ప్రతిగా మీరు ప్రజలు, ఆర్థికవేత్తలు చెప్పే మాటలు వినాలి. ఆర్థిక వ్యవస్థ పునరుత్తేజానికి అవసరమైన చర్యలు తీసుకుంటారేమోనని ఉద్యోగుల నుంచి దినసరి కూలీ వరకు ప్రతి ఒక్కరూ ఆశించారు. మీ సందేశం అందుకు వ్యతిరేకంగా ఉంది. సింబాలిజం ముఖ్యమే అయినా, దేశం కోలుకునేందుకు అవసరమైన చర్యలు కూడా ముఖ్యం. ఉదారమైన జీవనోపాధి ప్యాకేజి ప్రకటిస్తారనుకుంటే అందుకు విరుద్ధంగా ప్రజలను నిరాశకు గురిచేశారు. మార్చి 25న ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ తన ప్రసంగంలో పేదలను పూర్తిగా విస్మరించారు. ఇప్పుడు వాళ్ల గురించే మీరు ఆలోచించాలి" అంటూ తన అభిప్రాయాలు వెల్లడించారు.

More Telugu News