mumbai: ముంబై మురికివాడ 'ధారావి'లో మరో కలకలం.. మరొకరికి కరోనా పాజిటివ్‌!

  • బీఎంసీ పారిశుద్ధ కార్మికుడిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి (52)కి కరోనా 
  • క్వారంటైన్‌కు ఆయన కుటుంబ సభ్యులు
  • మరో 23 మంది కార్మికులు కూడా
Second COVID19 case confirmed in Dharavi  Mumbai

ఆసియాలోనే అతిపెద్ద మురికివాడ ముంబయిలోని 'ధారావి'లో కరోనా కలకలం చెలరేగుతోంది. దాదాపు 16 లక్షల మంది నివాసం ఉండే ఈ ప్రాంతంలో కరోనాతో ఓ వ్యక్తి మరణించడంతో అధికారులు అప్రమత్తమైన విషయం తెలిసిందే. ఈ ప్రాంతంలో కరోనా వ్యాప్తి మొదలైతే దాన్ని నిరోధించడం కష్టమైన పనని అధికారులు ఆందోళన చెందుతున్న వేళ అక్కడ మరో కరోనా కేసు నిర్ధారణ కావడం అలజడి రేపుతోంది.

ధారావిలో రెండో కరోనా పాజిటివ్‌ కేసు నమోదైనట్లు అధికారులు ప్రకటించారు. బీఎంసీ పారిశుద్ధ్య కార్మికుడిగా పనిచేస్తోన్న ఓ వ్యక్తి (52)కి కరోనా సోకిందని వివరించారు. ఆయన వర్లీలో ఉంటున్నప్పటికీ, పారిశుద్ధ్య పనుల దృష్ట్యా ఆయనకు అధికారులు ధారావిలో విధులు అప్పజెప్పారు.

ఆయనకు కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయగా పాజిటివ్‌ అని తేలింది. ఆయన పరిస్థితి ప్రస్తుతం నిలకడగానే ఉందని అధికారులు చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులతో పాటు ఆయనతో కలిసి పనిచేసిన మరో 23 మంది కార్మికులను క్వారంటైన్‌కు తరలిస్తామని బీఎంసీ అధికారులు చెప్పారు. 'ధారావి'పై అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టి చర్యలు తీసుకుంటున్నారు.

More Telugu News