Congress MLA: లాక్‌డౌన్ ను ఉల్లంఘించిన కాంగ్రెస్ ఎమ్మెల్యేపై కేసు

  • చత్తీస్‌గఢ్ ఎమ్మెల్యేపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు
  • పేదలకు తన ఇంటి వద్దే సరుకులు పంపిణీ 
  • పెద్ద ఎత్తున తరలివచ్చి గుమికూడిన జనం
Congress MLA Shailesh Pandey booked for violating lockdown

లాక్‌డౌన్ ఆంక్షలు ఉల్లంఘించారంటూ చత్తీస్‌గఢ్‌లోని బిలాస్‌పూర్‌కు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శైలేష్ పాండేపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఎమ్మెల్యే తన నివాసంలో పేదలకు రేషన్ సరుకులు పంపిణీ చేస్తున్న విషయం తెలిసి ప్రజలు పెద్ద సంఖ్యలో గుమికూడారు. దాదాపు వెయ్యిమందికిపైగా ఆయన ఇంటి వద్దకు చేరారు.

సమాచారం అందుకున్న పోలీసులు వారిని చెదరగొట్టి ఆయనపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో 144 సెక్షన్ అమల్లో ఉంది. దీనిని ఉల్లంఘించి సరుకులు పంపిణీ చేసిన ఎమ్మెల్యేపై సెక్షన్ 188, 144, 279ల కింద కేసు నమోదు చేసినట్టు అడిషనల్ ఎస్పీ ఓపీ శర్మ తెలిపారు.

అయితే, ఈ విషయంలో ఎమ్మెల్యే వాదన మరోలా ఉంది. తన ఇంటి వద్ద జనం పెద్ద సంఖ్యలో గుమికూడడంతో తానే స్వయంగా ఎస్పీకి సమాచారం అందించానని శైలేష్ పాండే తెలిపారు. ప్రజలు తిండిలేక కష్టాలు ఎదుర్కొంటుండడంతోనే తాను రేషన్ సరఫరా చేశానని, అది తప్పెలా అవుతుందని ఎమ్మెల్యే ప్రశ్నించారు.

More Telugu News