Kamal Nath: బీజేపీ అవిశ్వాస తీర్మానం పెట్టుకోవచ్చు... మధ్యప్రదేశ్ లో రివర్స్ అయిన కమల్ నాథ్!

  • జ్యోతిరాదిత్య తిరుగుబాటుతో సంక్షోభం
  • బల నిరూపణకు కమల్ నాథ్ ససేమిరా
  • గత రాత్రి గవర్నర్ ను కలిసి తన వాదన వినిపించిన సీఎం
No need to go for

కమల్ నాథ్ నేతృత్వంలో మధ్యప్రదేశ్ లో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ తీవ్ర సంక్షోభంలో చిక్కుకోగా, ప్రభుత్వం పడిపోతుందని భావించిన వారికి కమల్ నాథ్ షాకిచ్చారు. నిన్న రాత్రి పొద్దుపోయిన తరువాత గవర్నర్ ను కలిసిన ఆయన, తన ప్రభుత్వానికి పూర్తి మద్దతు ఉందని, లేదని భావిస్తే, బీజేపీ అవిశ్వాస తీర్మానాన్ని పెట్టుకోవచ్చని, తాను బలం నిరూపించుకోవాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు.

తమ ఎమ్మెల్యేలను బీజేపీ తన వైపుకు తిప్పుకునే ప్రయత్నాలు చేసిందని ఆరోపించిన ఆయన, అవిశ్వాస తీర్మానం పెట్టుకుంటే, ఎవరి బలం ఏమిటో అసెంబ్లీ వేదికగానే తేలుతుందని, తాను బల నిరూపణ చేసుకోవాల్సిన అవసరం ఏంటని గవర్నర్ ను ప్రశ్నించారు. నిన్న అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాగా, గవర్నర్ ప్రసంగం అనంతరం, కరోనా వైరస్ వ్యాప్తి కారణంగా సభను వాయిదా వేసిన సంగతి తెలిసిందే.

ఆ వెంటనే నేడు బల నిరూపణ నిమిత్తం అసెంబ్లీని సమావేశపరచాలని గవర్నర్ స్వయంగా స్పీకర్ కు లేఖ రాశారు. దీంతో అప్రమత్తమైన కమల్ నాథ్, గవర్నర్ ను కలిసి తన వాదన వినిపించారు. తనకు పూర్తి బలం ఉందని, తనకు మెజారిటీ లేదని భావించే వారు అవిశ్వాసాన్ని పెట్టవచ్చని అన్నారు.

కాగా, నేడు మధ్యప్రదేశ్ అసెంబ్లీ బల పరీక్ష అంశంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. జ్యోతిరాదిత్య సింథియా, బీజేపీలో చేరి, తన వర్గం ఎమ్మెల్యేలను క్యాంపునకు తరలించిన తరువాత రాష్ట్ర రాజకీయాలు మరో మలుపు తిరిగాయి. జ్యోతిరాదిత్యను బీజేపీ రాజ్యసభకు సైతం నామినేట్ చేసింది. ఈ సమయంలో ప్రభుత్వం పడిపోయి, బీజేపీ అధికారంలోకి రాకుంటే, జ్యోతిరాదిత్యపై ఉన్న పాత కేసులను తోడేందుకు కూడా రాష్ట్ర ప్రభుత్వం రంగం సిద్ధం చేయడంతో పరిస్థితి వేడెక్కింది.

More Telugu News