Madhya Pradesh: ఈ రోజుకి బలపరీక్ష లేనట్టే.. కమల్ నాథ్ సర్కారు ఒక రోజు ఊరట

  • విశ్వాస పరీక్షను అజెండాలో చేర్చని మధ్యప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ 
  • జ్యోతిరాదిత్య జంపింగ్ తో సంక్షోభంలో సర్కారు 
  • మరోవైపు బలపరీక్షకు సిద్ధమన్న సీఎం
No trust motion in madyapradesh assembly today

వెంటిలేటర్ పై ఉన్న మధ్యప్రదేశ్ లోని కమల్ నాథ్ సర్కారు మరోరోజు ఊపిరి పీల్చుకునే అవకాశం చిక్కింది. ఈ రోజు అజెంబ్లీ అజెండాలోని అంశాల్లో విశ్వాస పరీక్షను స్పీకర్ చేర్చలేదు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ సర్కార్ లో జ్యోతిరాదిత్య రూపంలో ముసలం మొదలైన విషయం తెలిసిందే. ఆరుగురు మంత్రులతోపాటు మొత్తం 20 మంది ఎమ్మెల్యేలు రాజీనామా చేయడం, జ్యోతిరాదిత్య బీజేపీ తీర్థం పుచ్చుకోవడంతో రాష్ట్రంలో కమల్ నాథ్ సర్కారు సంక్షోభంలో పడింది. దీంతో గవర్నర్ విశ్వాస పరీక్షకు ఆదేశించారు. 

ఇక గవర్నర్ ఆదేశాల మేరకు ఈ రోజు విశ్వాసపరీక్ష జరుగుతుందనుకున్నారు. విశ్వాస పరీక్షకు వెనుకడుగు వేసేది లేదని ముఖ్యమంత్రి కమలనాథ్ కూడా ప్రకటించారు. అయితే అసెంబ్లీ అజెండాలో చేరాల్సిన ఈ అంశం చేర్చలేదు. గవర్నర్ ప్రసంగం, ధన్యవాదాల తీర్మానం తప్పించి విశ్వాస పరీక్ష అంశం ఎజెండాలో కనిపించలేదు. దీంతో ఈరోజుకు పరీక్ష వాయిదాపడినట్టే. కాగా, స్పీకర్ ఎప్పుడు నిర్ణయిస్తే అప్పుడు బలపరీక్షకు సిద్ధమని సీఎం మరోసారి పునరుద్ఘాటించారు.

More Telugu News