Madhya Pradesh: పిల్ల బాగుందని పెళ్లి చేసుకుంటే కొంప కొల్లేరు చేసింది!

  • మధ్యప్రదేశ్ లో ఘటన
  • అమ్మాయి అందగత్తె కావడంతో ఎదురుకట్నం ఇచ్చి వివాహం
  • పెళ్లయిన కొన్ని వారాలకు ఇంట్లో ఉన్న నగలు, డబ్బుతో పరారీ
  • పోలీసులకు ఫిర్యాదు చేసిన కొత్త పెళ్లికొడుకు

అమ్మాయి చూడ్డానికి బాగుందని, ఇంకేం కావాలి అనుకుని ఓ యువకుడు ఎదురుకట్నం ఇచ్చి మరీ పెళ్లి చేసుకుని ఇప్పుడు లబోదిబోమంటున్నాడు. పెళ్లయిన మూడ్నెల్లకే ఆ మగువ విశ్వరూపం చూపించింది. ఇంట్లో ఉన్న నగానట్రాతో ఉడాయించింది. మధ్యప్రదేశ్ లో జరిగిందీ ఘటన. ఉదయ్ పూర్ జిల్లాలోని గుడ్లీ గ్రామానికి చెందిన ముఖేశ్ సేథియా ఇండోర్ అమ్మాయి స్వప్నను పెళ్లి చేసుకున్నారు. ఓ పెళ్లిళ్ల పేరయ్య ద్వారా స్వప్న గురించి తెలుసుకున్న ముఖేశ్ అమ్మాయి అందంగా ఉండడంతో రూ.5 లక్షల ఎదురుకట్నం ఇచ్చి పెళ్లాడాడు.

పెళ్లయిన నాటి నుంచి స్వప్నతో సంసార సుఖం లేకపోయినా ఆమె పట్ల ప్రేమగా వ్యవహరించాడు. సీక్రెట్ గా చాటింగ్ చేస్తున్నా సహించాడు. అయితే, పెళ్లయిన కొన్నివారాల తర్వాత ఉన్నట్టుండి స్వప్న మాయమైంది. ఇంట్లో ఉన్న నగలు, డబ్బు కూడా కనిపించకపోవడంతో హడలిపోయిన ముఖేశ్ చాలా చోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

దర్యాప్తు షురూ చేసిన పోలీసులు దిమ్మదిరిగే వాస్తవాలు తెలుసుకున్నారు. స్వప్న ఓ ముఠాలో సభ్యురాలని, సంపన్నుల బిడ్డలకు వలవేసి వారిని పెళ్లి ఉచ్చులో దింపి, అందినకాడికి దోచుకుని ఉడాయించడం ఆమె నైజమని గుర్తించారు. స్వప్న బారినపడింది ముఖేశ్ ఒక్కడే కాదట... ముఖేశ్ కంటే ముందు అనేకమందిని ముంచిన ఘనురాలు స్వప్న అని పోలీసులు వెల్లడించారు.

More Telugu News