Mobile Phone: సెల్​ ఫోన్​ అడిగితే ఇవ్వలేదని భార్యను చంపేశాడు!

  • మహారాష్ట్రలో దారుణానికి పాల్పడిన 51 ఏళ్ల వ్యక్తి
  • కత్తితో పొడవడంతో చనిపోయిన భార్య
  • తప్పించుకుని పారిపోతుండగా పట్టుకున్న స్థానికులు
Mumbai Man Kills Wife As She Refused To Hand Over Her Mobile Phone

పొద్దంతా ఎటో వెళ్లి రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పటికే బాగా తాగేసి ఉన్నాడు. ఇంట్లోకి వచ్చిన కొంత సేపటికి భార్యను పిలిచి, ఆమె సెల్ ఫోన్ ఇవ్వాలని అడిగాడు. ఆమె ఇవ్వనని చెప్పడంతో ఒక్కసారిగా మండిపడ్డాడు. ఇష్టమొచ్చినట్టుగా తిట్టడం మొదలుపెట్టాడు. ఆమె ఎదురుచెప్పే సరికి తీవ్రంగా ఆగ్రహించాడు. వంట గదిలోకి వెళ్లి కత్తి తీసుకొచ్చి ఇష్టమొచ్చినట్టుగా పొడిచాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మరణించింది. మహారాష్ట్రలోని ముంబై శివార్లలో ఉన్న చెంబూర్ సబర్బన్ ప్రాంతంలో ఈ ఘటన జరిగింది. ఆదివారం రాత్రి జరిగిన ఈ దారుణం వివరాలను పోలీసులు సోమవారం మీడియాకు వెల్లడించారు.

తప్పించుకుపోతుండగా..

భార్యను హత్య చేసిన వ్యక్తి పేరు జేమ్స్ జాన్ కురయ్యా. వయసు 51 ఏళ్లు. ఆమె పేరు రబియా జేమ్స్ వయసు 45 ఏళ్లు. ఆదివారం రాత్రి ఇంట్లో గొడవ జరిగే సమయంలో జాన్ బాగా తాగి ఉన్నట్టుగా పోలీసులు గుర్తించారు. భార్యను హత్య చేసిన తర్వాత జాన్ పారిపోవడానికి ప్రయత్నించాడు. అయితే స్థానికులు, ఇరుగుపొరుగున ఉండే బంధువులు అతడిని పట్టుకుని పోలీసులకు సమాచారం ఇచ్చారు.

చనిపోయిన మహిళ రెండో భార్య

హత్యకు గురైన రబియా జేమ్స్ జాన్ కు రెండో భార్య అని పోలీసులు తెలిపారు. ఆయన మొదటి భార్య సమీపంలోని మాన్ ఖుర్ద్ ప్రాంతంలో ఉంటున్నట్టు వెల్లడించారు. జాన్ పై హత్యా నేరం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలిపారు.

More Telugu News