కరోనా ఎఫెక్ట్... ఐపీఎల్ అనుకున్న సమయానికి ఆరంభమయ్యేనా..?

Corona scares looming over IPL start
  • ఈ నెల 29 నుంచి ఐపీఎల్ తాజా సీజన్
  • దేశంలో క్రమంగా పెరుగుతున్న కరోనా కేసుల సంఖ్య
  • ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే వాయిదాపడిన పలు క్రీడాపోటీలు
ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన క్రికెట్ లీగ్ గా గుర్తింపు తెచ్చుకున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా అనిశ్చితి ఎదుర్కొంటోంది. ఐపీఎల్ తాజా సీజన్ మార్చి 29న ఆరంభం కావాల్సి ఉంది. అయితే దేశంలో ప్రవేశించిన కరోనా మహమ్మారి అనేక రాష్ట్రాలకు విస్తరిస్తుండడంతో ఈ నెలాఖరు నాటికి పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయన్నది ప్రశ్నార్థకంగా మారింది. అప్పటికి కరోనా అదుపులోకి వచ్చి ఐపీఎల్ సజావుగా ఆరంభమవుతుందా అన్నది మిలియన్ డాలర్ల సందేహం!

ఇప్పటికే ప్రపంచవ్యాప్తంగా అనేక క్రీడా పోటీలు కరోనా భయంతో వాయిదా పడ్డాయి. మలేసియా వేదికగా ప్రతి ఏడాది జరిగే అజ్లాన్ షా హాకీ టోర్నీ వాయిదా పడింది. నేపాల్ లో జరగాల్సిన ఎవరెస్ట్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పోటీలకు సైతం కరోనా తాకిడి తప్పలేదు. ఈ టోర్నీ రీషెడ్యూల్ చేసేందుకు నిర్వాహకులు సిద్ధమయ్యారు. భారత్ లో ఇప్పుడిప్పుడే కరోనా కేసులు పెరుగుతున్న తరుణంలో మరికొన్ని వారాల్లో పరిస్థితి ఎలా ఉంటుందన్న దానిపైనే ఐపీఎల్ తాజా సీజన్ భవితవ్యం ఆధారపడి ఉంటుంది.

ఎందుకంటే, ఐపీఎల్ మ్యాచంటే వేలల్లో అభిమానులు స్టేడియాలకు వస్తుంటారు. గ్యాలరీల్లో క్రిక్కిరిసిన జనసందోహాల నడుమ కరోనా వ్యాప్తిని అడ్డుకోవడం దుస్సాధ్యమనే చెప్పాలి. ఓవైపు ఫ్రాంచైజీలన్నీ తమ ఆటగాళ్లతో సన్నాహాలు షురూ చేశాయి కానీ, లోలోపల భయం పీడిస్తూనే ఉంది. మరోవైపు, ఐపీఎల్ నిర్వహణపై బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ ధీమా వ్యక్తం చేస్తున్నా, కేంద్ర ప్రభుత్వం ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తి కలిగిస్తోంది.
IPL
Corona Virus
India
China
Sports
Cricket

More Telugu News