Telugudesam: రాష్ట్ర ప్రభుత్వంపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసిన ఏపీ టీడీపీ నేతలు

  • వ్యవస్థలను సీఎం నీరుగారుస్తున్నారని ఆరోపణ
  • ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని వ్యాఖ్యలు
  • స్థానిక ఎన్నికలు పారదర్శకంగా జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి
TDP leaders complains EC

ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావు ఆధ్వర్యంలో ఆ పార్టీ నేతలు రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ను కలిశారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రభుత్వ వ్యవస్థలను ముఖ్యమంత్రి బలహీనపరుస్తున్నారని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని, స్థానిక ఎన్నికలు ప్రజాస్వామ్యయుతంగా పారదర్శక విధానంలో జరిగేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

గ్రామాల్లో ప్రతిదానికీ వైసీపీ రంగులు వేశారని, పంచాయతీ కార్యాలయాలు, వాటర్ ట్యాంకులు, కరెంటు స్తంభాలకు ఆ పార్టీ జెండా రంగులు వేశారని, తద్వారా ఓటర్లు ప్రభావితమయ్యే అవకాశముందని టీడీపీ నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాదు, 90 శాతం వలంటీర్లు వైసీపీ వాళ్లేనంటూ గతంలో విజయసాయిరెడ్డి చేసిన వ్యాఖ్యలను కూడా ఈ సందర్భంగా ఎన్నికల కమిషనర్ ఎదుట ప్రస్తావించారు. కళా వెంకట్రావుతో పాటు ఎన్నికల కమిషనర్ ను కలిసిన వారిలో వర్ల రామయ్య, మంతెన సత్యనారాయణరాజు, అశోక్ బాబు తదితరులు ఉన్నారు.

More Telugu News