MUNion minister of State for Home Affairs: రాజ్యాంగం ప్రకారం అన్ని భాషలకు సమాన ప్రాధాన్యమిస్తాం: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి
రాజ్యాంగం ప్రకారం దేశంలోని అన్ని భాషలకు సమానమైన ప్రాధాన్యం ఉందని కేంద్ర హోం శాఖ సహాయమంత్రి జి.కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. లోక్ సభలో ఒక సభ్యుడు అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వకంగా జవాబిచ్చారు. దేశంలో ‘ఒకే దేశం-ఒకే భాష’ను అమలు చేసే ప్రతిపాదన తమ వద్ద లేదని మంత్రి తేల్చిచెప్పారు. దేశంలో ఒకే భాష అమలు కావాల్సిన అవసరముందని ఇటీవల హోం మంత్రి అమిత్ షా వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. దీనిపై పలు రాష్ట్రాల నుంచి వ్యతిరేకత వ్యక్తమైంది. మరో ప్రశ్నకు మంత్రి బదులిస్తూ.. కశ్మీర్లో భద్రతా బలగాలపై రాళ్లు రువ్వే వారి సంఖ్య తగ్గిందన్నారు. అధికరణ 370 రద్దు తర్వాత పరిస్థితి మెరుగుపడిందన్నారు. ఆగస్ట్ 5 నుంచి ఈ నెల 15 వరకు ఇలాంటి ఘటనలకు సంబంధించి 190 కేసులు నమోదయ్యాయన్నారు.