సుజనా, సీఎం రమేశ్, టీజీ, గరికపాటి విశ్వాస ఘాతకులు.. బీజేపీలో వీరిని టీడీపీ కోవర్టులనే అనుకుంటారు!: ఆలపాటి రాజా

  • నలుగురు పోతే 40 వేల మంది నాయకులు తయారవుతారు 
  • టీడీపీ రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం సిగ్గుచేటు
  • గుంటూరులో మీడియాతో టీడీపీ నేత
టీడీపీకి చెందిన రాజ్యసభ సభ్యులు సీఎం రమేశ్, సుజనా చౌదరి, టీజీ వెంకటేశ్, గరికపాటి రామ్మోహన్ ఇటీవల బీజేపీ తీర్థం పుచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో టీడీపీ నేత ఆలపాటి రాజా ఈ నలుగురు రాజ్యసభ సభ్యులపై తీవ్రంగా మండిపడ్డారు. ఈ నలుగురు నేతలు విశ్వాస ఘాతకులని రాజా ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరు బీజేపీలో చేరినా అక్కడి నేతలు మాత్రం ఈ నలుగురిని టీడీపీ కోవర్టులుగానే భావిస్తారని స్పష్టం చేశారు. గుంటూరులో ఈరోజు నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.

టీడీపీని నలుగురు నేతలు విడిచిపెట్టిపోతే, 40,000 మంది నాయకులు తయారు అవుతారని స్పష్టం చేశారు. కేవలం పార్టీని వీడటమే కాకుండా రాజ్యసభ పక్షాన్ని బీజేపీలో విలీనం చేయడం సిగ్గుచేటని విమర్శించారు. ఇక ఏపీ ముఖ్యమంత్రి జగన్ పై కూడా ఆలపాటి రాజా ఘాటు వ్యాఖ్యలు చేశారు. పోలవరం ప్రాజెక్టును చూసేందుకు జగన్ కు పదేళ్లు పట్టిందని ఆయన ఎద్దేవా చేశారు. అక్కడ జరుగుతున్న పనులు చూశాక ఏపీ ముఖ్యమంత్రి నోరు పెగలడం లేదని దుయ్యబట్టారు.
Go Back to Shorts
Andhra Pradesh
Telugudesam
alapati raja
Sujana Chowdary
CM Ramesh
Guntur District

More Telugu News