jagan: జగన్ కేసు విచారణ రాష్ట్ర పరిధిలో లేదని చంద్రబాబు, డీజీపీ చెప్పలేదు: కనకమేడల

షార్ట్స్‌లో చూడండి
వైసీపీ అధినేత జగన్ పై టీడీపీ ఎంపీ కనకమేడల రవీంద్ర కుమార్ విమర్శలు గుప్పించారు. హైదరాబాదులోని బంధువుల ఆసుపత్రిలో అయితే తమకు ఇష్టం వచ్చినట్టు సర్టిఫికెట్లు తయారు చేసుకోవచ్చని జగన్ భావించి ఉండవచ్చని అన్నారు. విశాఖ ఎయిర్ పోర్టులో ప్రథమ చికిత్సకు చెందిన రిపోర్టులు హైదరాబాదులోని సిటీ న్యూరో సెంటర్ వైద్యులు పరిశీలించారా? అని ఆయన ప్రశ్నించారు. అవేం పట్టించుకోకుండా సొంత వైద్య నివేదికలు ఇచ్చారని అన్నారు. జగన్ కు చట్టమన్నా, విచారణ అన్నా గౌరవం లేదని మండిపడ్డారు. కనీసం పోలీసులకు కూడా చెప్పకుండా వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్లిపోయారని... అప్పట్నుంచి ఢిల్లీ డైరెక్షన్ లో అసలైన కథ ప్రారంభమైందని దుయ్యబట్టారు.

కేంద్ర హోంమంత్రి రాజ్ నాథ్ ను వైసీపీ నేతలు కలవడం ద్వారా బీజేపీ-వైసీపీల ఉమ్మడి స్కెచ్ బయటపడిందని కనకమేడల అన్నారు. అక్రమాస్తుల కేసులో సీబీఐ విచారణను తప్పుబట్టిన జగన్... ఇప్పుడు కేంద్ర సంస్థలతో దర్యాప్తు కోరడం వెనకున్న అంతర్యం ఏమిటని ప్రశ్నించారు. పాదయాత్రకు బ్రేక్ ఇవ్వాలనే జగన్ నాటకాలు ఆడుతున్నారని ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంది కాబట్టే హత్యాయత్నం కింద కేసు నమోదు చేశామని చెప్పారు. జగన్ పై దాడి జరిగిన వెంటనే స్పందించిన గవర్నర్... ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలను మావోయిస్టులు హత్య చేస్తే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి కాని, డీజీపీ కాని కేసు విచారణ రాష్ట్ర పరిధిలో లేదని చెప్పలేదని అన్నారు. విమానాశ్రయం కేంద్రం పరిధిలో ఉంటుందని మాత్రమే అన్నారని తెలిపారు. 
Go Back to Shorts
jagan
Chandrababu
kanakamedala

More Telugu News