డిసెంబర్ లో ఎన్నికలు జరిగినంత మాత్రాన.. కేసీఆర్ గెలుస్తారా?: అమిత్ షా ఎద్దేవా
- ఒవైసీకి భయపడి రాష్ట్ర విమోచన దినాన్ని కేసీఆర్ నిర్వహించడం లేదు
- కేసీఆర్ పై దళితులంతా ఆగ్రహంతో ఉన్నారు
- కాంగ్రెస్ తుడిచిపెట్టుకుపోవడం ఖాయం
తెలంగాణలో దళితులపై అఘాయిత్యాలు పెరిగిపోయాయని అమిత్ షా మండిపడ్డారు. 2014లో దళితుడిని సీఎం చేస్తామని చెప్పిన కేసీఆర్.. ఇప్పటికైనా ఆ పని చేస్తారా? అని ప్రశ్నించారు. దళితులంతా కేసీఆర్ పై ఆగ్రహంతో ఉన్నారని అన్నారు. తెలంగాణలో దళితులకు, ఆదివాసీలకు భరోసా ఇవ్వగలిగిన పార్టీ బీజేపీ మాత్రమే అని చెప్పారు.
వచ్చే ఎన్నికల్లో అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ కలలు కంటున్నారని... వరుసగా పలు రాష్ట్రాల్లో జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ పరిస్థితి ఏమైందో ఆయన ఒకసారి గుర్తుకు తెచ్చుకోవాలని అమిత్ షా అన్నారు. పీవీ నరసింహారావు, అంజయ్యలను కాంగ్రెస్ పార్టీ ఎలా అవమానించిందో తెలంగాణ ప్రజలందరికీ తెలుసని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకు పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.