Rahul Gandhi: కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు సమర్ధిస్తున్నారు?: రాహుల్ గాంధీ

షార్ట్స్‌లో చూడండి
రాష్ట్ర విభజన సమయంలో ఆంధ్రా, తెలంగాణలకు స్పష్టమైన హామీలిచ్చామని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ అన్నారు. శేరిలింగంపల్లి బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ, తెలంగాణకు రావాల్సినవి, ఇవ్వాల్సినవి ఇవ్వనేలేదని, ఈ విషయమై కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు ప్రశ్నించడం లేదని రాహుల్ ప్రశ్నించారు. తెలంగాణకు నయాపైసా ఇవ్వకపోయినా కేంద్రాన్ని కేసీఆర్ ఎందుకు సమర్ధిస్తున్నారు? అని ప్రశ్నించారు. ఆంధ్రాకు ఇచ్చిన హామీలనూ మోదీ సర్కార్ వమ్ము చేసిందని, ఏపీకి ప్రత్యేక హోదానే కాదు, ఏపీ హక్కులన్నింటినీ కాలరాశారని మండిపడ్డారు. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రాన్ని నిలదీయడం రాష్ట్రాల హక్కు అని అన్నారు.

ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని చట్టంలో పెట్టింది కాంగ్రెస్సే అని, మిగతా పార్టీలు ఏవీ అడగలేదని, తాము అధికారంలోకి వస్తే, ఏపీకి ప్రత్యేకహోదా ఇచ్చి తీరుతామని, మోదీలా తాము పారిపోమని రాహుల్ గాంధీ అన్నారు. ఈ సందర్భంగా మీడియా స్వేచ్ఛ గురించి ఆయన ప్రస్తావించారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా మీడియా స్వేచ్ఛగా పనిచేయలేకపోతోందని, ఎవరన్నా సూటిగా రాస్తే ఎంతగా వేధించాలో అంతగా వేధిస్తున్నారని చెబుతూ, ‘భయపడొద్దు..ఏం జరుగుతోందో ధైర్యంగా రాయండి’ అని రాహుల్ మీడియాకు పిలుపు నిచ్చారు.
Go Back to Shorts
Rahul Gandhi
Hyderabad

More Telugu News