కొత్త వివాదం... లాలూను విమానం ఎక్కించేంత డబ్బు లేదన్న జార్ఖండ్ సర్కారు... బలవంతంగా రైలెక్కించిన పోలీసులు!
- పశుదాణా కుంభకోణం కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న లాలూ
- వైద్య చికిత్స కోసం ఢిల్లీ తీసుకెళ్లాలని సూచించిన డాక్టర్లు
- 16 గంటల రైలు ప్రయాణం చేసిన ఆర్జేడీ అధినేత
- జార్ఖండ్ సర్కారు వైఖరిని తప్పుబడుతున్న ఆర్జేడీ
రాంచీ నుంచి 16 గంటల పాటు రైల్లో ప్రయాణించిన లాలూ, ఢిల్లీలోని ఎయిమ్స్ లో చేరి చికిత్సను పొందుతుండగా, దీనిపై జార్ఖండ్ మంత్రి సరయూ రాయ్ స్పందించారు. ఆయన్ను విమానంలోనే పంపి ఉండాల్సిందని, రైల్లో ఎందుకు పంపారో తెలియదని అన్నారు. దీనిపై ఆర్జేడీ తీవ్రంగా మండిపడింది. ఆయన ఆరోగ్యం బాగాలేదని తెలిసి కూడా అంతదూరం పాటు రైల్లో ప్రయాణానికి ఎలా అనుమతించారని, ఏదైనా జరగరానిది జరిగితే బాధ్యత ఎవరిదని ప్రశ్నించింది.
జార్ఖండ్ విడిపోవడానికి ముందు, లాలూ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అక్టోబర్ 1990లో నిరసన తెలుపుతున్న అద్వానీని అరెస్ట్ చేసిన పోలీసులు, ప్రత్యేక హెలికాప్టర్ లో తరలించిన విషయాన్ని ఆర్జేడీ నేత శివానంద తివారీ గుర్తు చేశారు. 2014లో గుండెకు శస్త్రచికిత్స చేయించుకున్న లాలూ, మధుమేహంతో పాటు మరికొన్ని దీర్ఘకాల వ్యాధులతోనూ బాధపడుతున్న సంగతి తెలిసిందే.