మాజీ మంత్రి కాకాణి విచారణ నేటికి వాయిదా

  • మాజీ మంత్రి కాకాణి విచారణ నేటికి వాయిదా
  • కాకాణికి మరో నోటీసు జారీ చేసిన పోలీసులు
  • కాకాణి అందుబాటులో లేకపోవడంతో కుమారుడికి నోటీసు అందజేత 
  • నేడు హైకోర్టులో కాకాణి పిటిషన్లపై విచారణ
నెల్లూరు జిల్లాకు చెందిన సీనియర్ వైసీపీ నేత, మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డికి పోలీసులు మరోసారి నోటీసులు జారీ చేశారు. క్వార్ట్జ్ అక్రమ క్వారీయింగ్‌పై ఆయనపై నమోదైన కేసులో ఈ రోజు (ఏప్రిల్ 1) నెల్లూరు రూరల్ డీఎస్పీ కార్యాలయానికి విచారణకు రావాలని నోటీసు జారీ చేశారు. నిన్న (మార్చి 31న) విచారణకు కాకాణి గైర్హాజరయ్యారు.

దీంతో ఆయన పారిపోయారంటూ ప్రచారం జరగగా, తాను హైదరాబాద్‌లోని నివాసంలో కుటుంబ సభ్యులతో ఉగాది వేడుకలు జరుపుకొంటున్నట్లు తెలిపేలా కాకాణి సోషల్ మీడియాలో ఫోటోలు పోస్ట్ చేశారు. దీంతో వెంటనే పోలీసులు నోటీసులు ఇచ్చేందుకు నిన్న హైదరాబాద్ వెళ్లారు. కమలాపురి కాలనీలోని ఆయన నివాసానికి పోలీసులు వెళ్లగా, ఆయన అక్కడ లేరు. ఫోన్‌లో మాట్లాడేందుకు ప్రయత్నించగా, అందుబాటులోకి రాలేదని సమాచారం. దీంతో ఆయన కుమారుడు సుమంత్‌కు పోలీసులు రెండో నోటీసు అందించారు. మంగళవారం (ఈరోజు) నెల్లూరు డీఎస్పీ కార్యాలయానికి హాజరుకావాలని నోటీసులో పేర్కొన్నారు.

అయితే, ఈ రోజు కాకాణి విచారణకు హాజరుకాకపోతే చట్టపరంగా ముందుకు వెళతామని పోలీసులు అంటున్నారు. మరోపక్క ఏపీ హైకోర్టులో కాకాణి దాఖలు చేసిన బెయిల్ పిటిషన్‌పై నేడు విచారణ జరగనుంది. అలానే తనపై నమోదు చేసిన ఎఫ్‌ఐఆర్‌ను కొట్టివేయాలని కోరుతూ కాకాణి దాఖలు చేసిన క్వాష్ పిటిషన్‌పై కూడా ఈ రోజు ఉన్నత న్యాయస్థానం విచారణ జరపనుంది. ఈ నేపథ్యంలో కాకాణి పోలీసు విచారణకు హాజరవుతారా లేదా అనేది రాజకీయ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 


More Telugu News