డీఎస్సీపై వైసీపీ విష ప్రచారం.. మాజీ సైనికుడిపై దాడి హేయం: కోటంరెడ్డి

డీఎస్సీపై వైసీపీ విష ప్రచారం.. మాజీ సైనికుడిపై దాడి హేయం: కోటంరెడ్డి

Kotamreddy Sridhar Reddy slams YSRCP propaganda on Mega DSC and attack on ex-serviceman
  • మెగా డీఎస్సీపై వైసీపీ, సాక్షి మీడియా విషం చిమ్ముతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి ఫైర్
  • కుప్పంలో మాజీ సైనికుడిపై వైసీపీ శ్రేణులు, సాక్షి ప్రతినిధులు దౌర్జన్యం చేశారని ఆరోపణ
  • జగన్ ప్రెస్‌మీట్ పెడితే పార్టీకి లక్ష ఓట్లు నష్టమని వైసీపీ నేతలే వాపోతున్నారన్న కోటంరెడ్డి
  • గత ఐదేళ్లలో ఒక్క టీచర్ పోస్ట్ ఇవ్వని జగన్‌కు డీఎస్సీ, ఏపీపీఎస్సీకి తేడా తెలియదని ఎద్దేవా
మెగా డీఎస్సీ నియామకాలపై వైసీపీ, సాక్షి మీడియా ఉద్దేశపూర్వకంగా విష ప్రచారం చేస్తున్నాయని, రాష్ట్ర ప్రతిష్ఠను దెబ్బతీసేందుకు కుట్రలు పన్నుతున్నాయని ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దేశ సరిహద్దుల్లో సేవలు అందించిన ఒక మాజీ సైనికుడిపై దాడికి దిగడం వైసీపీ గూండాయిజానికి నిదర్శనమని ధ్వజమెత్తారు. సోమవారం మంగళగిరిలోని ఎన్టీఆర్ భవన్‌లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం పారదర్శకంగా భర్తీ చేసిన 16,347 ఉపాధ్యాయ పోస్టులను చూసి ఓర్వలేకే వైసీపీ దగాకోరు రాజకీయాలకు పాల్పడుతోందని విమర్శించారు.

మాజీ సైనికుడిపై దాడి దుర్మార్గం

కుప్పంలో మాజీ సైనికుడు చక్రపాణి రెడ్డిపై వైసీపీ శ్రేణులు, సాక్షి ప్రతినిధులు సాగించిన దౌర్జన్యం అత్యంత హేయమైన చర్య అని కోటంరెడ్డి అన్నారు. "దేశం కోసం ప్రాణాలను పణంగా పెట్టిన సైనికుడిపై దాడి చేస్తారా? నీ సర్టిఫికెట్లు దొంగవి అంటూ బెదిరించడానికి సాక్షి మీడియా, వైసీపీ నేతలు సీబీఐ అధికారులా? అధికారం పోయినా గూండాయిజం చేస్తామంటే కుదరదు. ఈ ఘటనపై నాన్-బెయిలబుల్ కేసులు నమోదు చేసి, నిందితులపై రౌడీషీట్లు తెరిచి పీడీ యాక్ట్ కింద జైలుకు పంపాలి" అని ఆయన డిమాండ్ చేశారు.

ఎన్టీఆర్ జిల్లాకు చెందిన వేముల రామకృష్ణ అనే అభ్యర్థికి డీఎస్సీలో ఉద్యోగం రాలేదని స్వయంగా ఆయనే వెల్లడించినా, వైసీపీ తప్పుడు ప్రచారం చేసిందని కోటంరెడ్డి విమర్శించారు. "రామకృష్ణ మీడియా ముందుకు వచ్చి, తనకు ఉద్యోగమే రాలేదని, ప్రస్తుతం ప్రైవేట్ స్కూల్లో పనిచేస్తున్నానని స్పష్టం చేశారు. దీంతో వైసీపీ అబద్ధాల బండారం బట్టబయలైంది. డీఎస్సీని అడ్డుకునేందుకు హైకోర్టులో 335 కేసులు వేయించి భంగపడ్డారు. ఇప్పుడు ఇలాంటి నీచ రాజకీయాలు చేస్తున్నారు" అని అన్నారు.

జగన్‌పై తీవ్ర విమర్శలు

గత ఐదేళ్ల పాలనలో రాష్ట్రాన్ని అన్ని విధాలా నాశనం చేసిన జగన్ కు, డీఎస్సీకి ఏపీపీఎస్సీకి తేడా కూడా తెలియదని కోటంరెడ్డి ఎద్దేవా చేశారు. "15 రోజులకోసారి బెంగళూరు నుంచి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, అబద్ధాలు మాట్లాడటం జగన్‌కు అలవాటైంది. ఆయన ప్రెస్ మీట్ పెడితే పార్టీకి లక్ష ఓట్లు గల్లంతవుతున్నాయని సొంత పార్టీ నేతలే వాపోతున్నారు. ఇప్పటికైనా ఆయన పద్ధతి మార్చుకోకపోతే, వచ్చే ఎన్నికల్లో మిగిలిన 11 సీట్లు కూడా దక్కవు" అని కోటంరెడ్డి హెచ్చరించారు. రాష్ట్రానికి వస్తున్న పెట్టుబడులను అడ్డుకోవాలనే దురుద్దేశంతోనే వైసీపీ అలజడులు సృష్టిస్తోందని, ప్రజలు ఈ కుట్రలను నమ్మవద్దని ఆయన పిలుపునిచ్చారు.


Advertisement
Kotamreddy Sridhar Reddy
AP Mega DSC 2024
YSRCP Sakshi Propaganda
Andhra Pradesh Teacher Recruitment
Jagan Mohan Reddy
Ex Serviceman Attack Kuppam

More Telugu News