తిరుపతి కిడ్నాప్ కేసులో సంచలనం.. స్నేహితులే సూత్రధారులు!

Tirupati Kidnapping Case Sensation Friends Mastermind 20 Days Of Torture
  • యూకేలో చదివిన యువకుడిని స్నేహితులే డబ్బు కోసం కిడ్నాప్ చేసిన వైనం
  • 20 రోజుల పాటు బంధించి, చిత్రహింసలకు గురిచేసిన మిత్రులు
  • అత‌ని టెలిగ్రామ్ ఛానల్‌ బలవంతంగా రూ.6 కోట్లకు అమ్మకం
  • హైదరాబాద్‌లో బాధితుడిని రక్షించిన పోలీసులు
  • ఈ కేసులో ముగ్గురిని అరెస్ట్ చేసిన తిరుపతి పోలీసులు
డబ్బుపై కన్నేసిన స్నేహితులే ఓ యువకుడిని కిడ్నాప్ చేసి, 20 రోజుల పాటు బంధించి చిత్రహింసలకు గురిచేశారు. అతని టెలిగ్రామ్ ఛానల్‌ను బలవంతంగా రూ.6 కోట్లకు అమ్మి ఆ డబ్బును కాజేశారు. పోలీసుల సహాయంతో బయటపడిన తర్వాత కూడా బెదిరింపులకు పాల్పడటంతో ఈ కేసులో పోలీసులు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. తిరుపతి జిల్లాలో కలకలం రేపిన ఈ కిడ్నాప్ ఉదంతం వివరాలను తిరుపతి రూరల్ సీఐ మద్దయ్యచారి మీడియాకు వెల్లడించారు.

చంద్రగిరి మండలం కొటాలకు చెందిన సుమంత్, యూకేలో ఎంఎస్ పూర్తి చేశారు. 'నాని క్రికెట్ ప్రిడిక్షన్' పేరుతో ఓ టెలిగ్రామ్ ఛానల్ నిర్వహిస్తుండగా, దానికి 1.85 లక్షల మంది ఫాలోవర్లు ఉన్నారు. ఈ ఛానల్ ద్వారా అతనికి అనధికారికంగా మంచి ఆదాయం వస్తుండటాన్ని స్నేహితులైన గౌతమ్, మనోజ్, యశ్వంత్ రెడ్డి గమనించారు. సుమంత్ ఖర్చులను చూసి ఆశ్చర్యపోయిన వారు, అతడిని కిడ్నాప్ చేసి డబ్బు గుంజాలని పథకం పన్నారు.

ఇటీవల బాలి పర్యటనకు వెళ్లి జులై 29న బెంగళూరుకు తిరిగి వచ్చిన సుమంత్‌కు నిందితులు ఫోన్ చేశారు. తాము కూడా బెంగళూరులోనే ఉన్నామని, కలిసి కారులో ఊరికి వెళ్దామని నమ్మబలికారు. కారులో ఎక్కించుకున్న తర్వాత నేరుగా శ్రీనివాసమంగాపురంలోని ఓ హోమ్‌స్టేకు తీసుకెళ్లి బంధించారు. తమ స్నేహితులైన బాలాజీ, చరణ్, వాజిద్‌ బాషాలను పిలిపించి సుమంత్‌పై దాడి చేయించారు. రూ.5 కోట్లు ఇవ్వకపోతే చంపేస్తామని బెదిరించారు.

అనంతరం అక్కడ ఉండటం సురక్షితం కాదని భావించి సుమంత్‌ను హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో మనోజ్‌కు చెందిన ఫ్లాట్‌కు మార్చారు. అక్కడ సుమారు 20 రోజుల పాటు నిర్బంధించి చిత్రహింసలు పెట్టారు. ఆ తర్వాత సుమంత్ టెలిగ్రామ్ ఛానల్‌ను రూ.6 కోట్లకు బలవంతంగా అమ్మించి, ఆ డబ్బును నగదు రూపంలో, బ్యాంకు ఖాతాల్లోకి బదిలీ చేయించుకున్నారు. ఆగస్టు 22న నిందితుల కళ్లుగప్పి సుమంత్, లండన్‌లో ఉన్న తన స్నేహితురాలికి సమాచారం అందించారు. ఆమె వెంటనే తెలంగాణ డీజీపీకి ఈ-మెయిల్ ద్వారా ఫిర్యాదు చేయడంతో కేపీహెచ్‌బీ పోలీసులు రంగంలోకి దిగారు.

పోలీసులు కూకట్‌పల్లిలోని అపార్ట్‌మెంట్‌పై దాడి చేసి సుమంత్‌ను రక్షించారు. గౌతమ్, మనోజ్‌లను అరెస్ట్ చేసి, వారి వద్ద ఉన్న రూ.30 లక్షలను స్వాధీనం చేసుకున్నారు. అయితే, గేమింగ్ చట్టం కింద కేసు నమోదు చేసి వారిని విడిచిపెట్టారు. తిరుపతిలోని తన ఇంటికి చేరుకున్న సుమంత్‌ను, నిందితుల స్నేహితుడు బాలాజీ చంపేస్తానని బెదిరించాడు. దీంతో బాధితుడు ఆగస్టు 28న తిరుపతి రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు గురువారం బాలాజీ, చరణ్, వాజిద్‌ బాషాలను అరెస్టు చేశారు. పరారీలో ఉన్న ప్రధాన నిందితులు గౌతమ్, మనోజ్, యశ్వంత్‌ల కోసం గాలిస్తున్నారు.
Advertisement
Sumanth
Tirupati Kidnap Case
Nani Cricket Prediction Telegram
Telegram Channel Extortion
Andhra Pradesh Police
Hyderabad Kidnapping Incident

More Telugu News