మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసు: అన్నమయ్య జిల్లా డీఎంహెచ్‌ఓ లక్ష్మీనరసయ్య సస్పెన్షన్

Kidney racket case Annamayya DMHO Lakshmi Narasayya suspended
  • గతేడాది అక్రమంగా కిడ్నీ తొలగించడంతో ఓ మహిళ మృతి  
  • విచారణలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని, తప్పుడు నివేదిక ఇచ్చారని ఆరోపణలు
  • డీఎంహెచ్‌ఓపై శాఖాపరమైన విచారణకు ఆదేశం 
మదనపల్లెలో తీవ్ర కలకలం రేపిన కిడ్నీ రాకెట్ వ్యవహారంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక చర్యలు చేపట్టింది. ఈ కేసు విచారణలో తీవ్ర నిర్లక్ష్యం వహించినట్లు వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, అన్నమయ్య జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి (డీఎంహెచ్‌ఓ) డాక్టర్ కె. లక్ష్మీనరసయ్యను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి జి. వీరపాండియన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

ఈ కేసులో తగిన ఆధారాలు లేవంటూ డీఎంహెచ్‌ఓ తప్పుడు నివేదికను సమర్పించి, విచారణను తప్పుదోవ పట్టించినట్లు ప్రభుత్వ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. కేవలం సదరు ఆసుపత్రి లైసెన్సును రద్దు చేయడంతోనే తన బాధ్యత ముగిసిందని భావించి, పరిపాలనాపరమైన చర్యలను పరిమితం చేశారని ప్రభుత్వం ఆగ్రహం వ్యక్తం చేసింది. అంతేకాకుండా, గౌరవ హైకోర్టుకు ఈ కేసులోని వాస్తవాలను నివేదించడంలో ఆయన విఫలమయ్యారని స్పష్టం చేస్తూ, ఆయనపై శాఖాపరమైన విచారణకు ఆదేశించింది.

కేసు నేపథ్యం:

2025 నవంబర్‌లో మదనపల్లెలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రిలో ఈ కిడ్నీ రాకెట్ వెలుగు చూసింది. విశాఖపట్నంకు చెందిన యమున (29) అనే మహిళ నుంచి అక్రమంగా కిడ్నీని తొలగించగా, తీవ్ర అస్వస్థతకు గురై ఆమె 2025 నవంబర్ 10వ తేదీన ప్రాణాలు కోల్పోయారు. ఈ దారుణాన్ని కప్పిపుచ్చేందుకు ఆసుపత్రి యాజమాన్యం, మధ్యవర్తులు కలిసి మృతదేహాన్ని రహస్యంగా తిరుపతికి తరలించారు. అయితే, ఒప్పందం ప్రకారం తనకు అందాల్సిన రూ.6 లక్షలు ఇవ్వలేదని సూరిబాబు అనే మధ్యవర్తి పోలీసులను ఆశ్రయించడంతో ఈ అక్రమ కిడ్నీ విక్రయాల వ్యవహారం బయటపడింది.                                
Advertisement
Lakshmi Narasayya
Annamayya DMHO
Madanapalle kidney racket case
Andhra Pradesh Health Department
Global Multi Specialty Hospital
Kidney trade investigation

More Telugu News