అమిత్ షాపై వ్యాఖ్యలు: రాహుల్‌గాంధీకి లోక్‌సభ ప్రివిలేజ్ నోటీసు

Rahul Gandhi receives Lok Sabha privilege notice for remarks against Amit Shah
  • బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్, సంజయ్ జైస్వాల్ ఫిర్యాదు
  • లోక్‌సభ నియమావళిలోని రూల్ 353ని ఉల్లంఘించారని ఆరోపణ
  • ఆగస్టు 28లోగా సమాధానం ఇవ్వాలని రాహుల్‌కు ఆదేశం
కేంద్ర హోంమంత్రి అమిత్ షాపై చేసిన వ్యాఖ్యలకు గాను లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీకి విశేషాధికారాల ఉల్లంఘన (ప్రివిలేజ్) నోటీసు జారీ అయింది. ఈ మేరకు లోక్‌సభ సెక్రటేరియట్ ఆయనకు నోటీసులు పంపుతూ, ఆగస్టు 28వ తేదీలోగా వివరణ ఇవ్వాలని ఆదేశించింది.

పబ్లిక్ ఎగ్జామినేషన్ (అక్రమ మార్గాల నివారణ) సవరణ బిల్లు-2026పై చర్చ సందర్భంగా రాహుల్‌గాంధీ చేసిన వ్యాఖ్యలపై బీజేపీ ఎంపీలు ఫిర్యాదు చేశారు. బీజేపీ ఎంపీలు అనురాగ్ ఠాకూర్ (జులై 30), డాక్టర్ సంజయ్ జైస్వాల్ (జులై 29) ఈ మేరకు ఫిర్యాదులు దాఖలు చేశారు. రాహుల్ గాంధీ సభలో అన్‌పార్లమెంటరీ పదజాలాన్ని ఉపయోగించారని, సభా నిబంధనలను ఉల్లంఘిస్తూ అమిత్ షాపై తీవ్రమైన ఆరోపణలు చేశారని వారు తమ ఫిర్యాదులో పేర్కొన్నారు.

లోక్‌సభ నియమావళిలోని రూల్ 353 ప్రకారం, ఒక మంత్రిపై ఆరోపణలు చేసే ముందు ముందస్తు నోటీసు ఇవ్వాల్సి ఉండగా, రాహుల్ ఆ నిబంధనను అతిక్రమించారని ఎంపీలు ఆరోపించారు. దేశ రాజధానిలో నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కాల్పులు జరపాలని అమిత్ షా ఆదేశించారంటూ రాహుల్ చేసిన ఆరోపణలను వారు ప్రధానంగా ప్రస్తావించారు.

రాహుల్ గాంధీకి పంపిన ఈ నోటీసుతో పాటు బీజేపీ ఎంపీల ఫిర్యాదు ప్రతులను కూడా జత చేశారు. రాహుల్ ఇచ్చే సమాధానాన్ని పరిశీలించిన తర్వాత, తదుపరి చర్యలపై స్పీకర్ కార్యాలయం లేదా ప్రివిలేజ్ కమిటీ తుది నిర్ణయం తీసుకుంటుంది.                                
Advertisement
Rahul Gandhi
Amit Shah
Lok Sabha Privilege Notice
Anurag Thakur
Sanjay Jaiswal
Lok Sabha Secretariat

More Telugu News