ఇంటింటికీ టీడీపీ: 14 రోజుల్లో 40 లక్షల గడపలు.. మంత్రులకు లోకేశ్ కీలక ఆదేశాలు

Nara Lokesh issues key orders to ministers as Intintiki TDP reaches 40 lakh houses in 14 days
  • 14వ రోజుకు చేరుకున్న ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమం
  • 14 రోజుల్లో 40 లక్షల కుటుంబాలను కలిసిన టీడీపీ శ్రేణులు
  • కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై ప్రజలకు వివరణ
  • క్షేత్రస్థాయిలో పర్యటించాలని మంత్రులకు నారా లోకేష్ ఆదేశం
తెలుగుదేశం పార్టీ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన 'ఇంటింటికీ తెలుగుదేశం – 2 ఏళ్ల నమ్మకం' కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనలో సాధించిన ప్రగతిని, సంక్షేమ ఫలాలను ప్రజలకు నేరుగా వివరించే ఈ కార్యక్రమం ఆదివారం నాటికి 14వ రోజుకు చేరుకుంది. గడిచిన 14 రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా పార్టీ శ్రేణులు 40.74 లక్షలకు పైగా కుటుంబాలను నేరుగా కలుసుకుని రికార్డు సృష్టించాయి.

కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనతో ఈ కార్యక్రమం పండుగ వాతావరణంలో సాగుతోంది. ఇందులో భాగంగా ఆదివారం ఒక్కరోజే రాష్ట్రవ్యాప్తంగా 3.53 లక్షల ఇళ్లను టీడీపీ నాయకులు, కార్యకర్తలు సందర్శించారు. ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన 'సూపర్ సిక్స్' హామీల అమలు తీరును, ఇతర సంక్షేమ పథకాల ద్వారా పేదలకు అందుతున్న ప్రయోజనాలను ప్రతి కుటుంబానికి వివరిస్తున్నారు.

ఈ కార్యక్రమ పురోగతిపై టీడీపీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేశ్ ప్రత్యేక దృష్టి సారించారు. కార్యక్రమాన్ని మరింత సమర్థవంతంగా క్షేత్రస్థాయిలోకి తీసుకెళ్లేందుకు ఆయన పార్టీ శ్రేణులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా, జిల్లాల ఇన్‌ఛార్జ్ మంత్రులు తమకు కేటాయించిన ప్రాంతాల్లో తప్పనిసరిగా పర్యటించాలని, ప్రజలతో మమేకమై ప్రభుత్వ విజయాలను వివరించాలని స్పష్టం చేశారు. క్లస్టర్, మండల స్థాయి నాయకులను ఫోకస్ బూత్‌లకు అనుసంధానించి, సమన్వయంతో పనిచేయాలని దిశానిర్దేశం చేశారు.

మంత్రులు, ఎమ్మెల్యేల నుంచి గ్రామ స్థాయి కార్యకర్తల వరకు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో సమష్టిగా పాల్గొంటున్నారని, ప్రజల నుంచి అద్భుతమైన స్పందన వస్తోందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ కార్యక్రమం ద్వారా ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న నమ్మకాన్ని మరింత పటిష్ఠం చేయాలని టీడీపీ భావిస్తోంది.
Advertisement
Nara Lokesh
Intintiki TDP
Andhra Pradesh Politics
Super Six Promises
TDP Door to Door Campaign
TDP Welfare Schemes

More Telugu News