జాతీయ జెండాతో పాటు మీ అజెండా ఉండాలి: సీఎం చంద్రబాబు

Chandrababu Naidu says your agenda should be with the national flag
  • నేడు అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం
  • విజయవాడలో కార్యక్రమం... హాజరైన సీఎం చంద్రబాబు
  • ప్రతి ఒక్కరూ వ్యక్తిగత బాధ్యత తీసుకోవాలని సీఎం పిలుపు
  • జీవో నెంబర్ 3ను చట్టపరంగా కాపాడతామని ఆదివాసులకు భరోసా
  • అరకు కాఫీ తరహాలో స్థానిక గిరిజన ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్
  • ద్రౌపది ముర్ము స్ఫూర్తితో ఎదిగి దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని యువతకు ఉద్బోధ
అంతర్జాతీయ ఆదివాసీ దినోత్సవం వేదికగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక స్ఫూర్తిదాయక ప్రసంగం చేశారు. దేశభక్తి అంటే కేవలం సరిహద్దుల్లో పోరాడటం మాత్రమే కాదని, ప్రతి పౌరుడు తన వృత్తిలో విజయం సాధించి, సమాజానికి సేవ చేయడమే నిజమైన దేశభక్తి అని ఉద్బోధించారు. ప్రతి ఒక్కరూ తమకంటూ ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దేశాభివృద్ధిలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా విజయవాడ అంబేద్కర్ కళావేదికలో జరిగిన సభకు చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ... గిరిజన సమాజానికి సమగ్ర అభివృద్ధి, సంక్షేమంపై పలు కీలక హామీలు ఇస్తూ, వారి హక్కులను కాపాడేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని భరోసా ఇచ్చారు.

ప్రతి వ్యక్తి ఒక శక్తి.. ద్రౌపది ముర్ము ఆదర్శం

సాధారణ ఆదివాసీ కుటుంబంలో పుట్టి, అనేక కష్టాలను అధిగమించి, దేశ ప్రథమ పౌరురాలిగా అత్యున్నత శిఖరాలను అధిరోహించిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీవితం ప్రతి ఒక్కరికీ ఆదర్శమని చంద్రబాబు అన్నారు. ఆమె స్ఫూర్తితో గిరిజన యువత ఉన్నత లక్ష్యాలను ఏర్పరచుకోవాలని సూచించారు. జాతీయ జెండాతో పాటు మీ అజెండా కూడా ఉండాలని పిలుపునిచ్చారు.

"సంకల్పం బలంగా ఉంటే ఏదైనా సాధించవచ్చు. ద్రౌపది ముర్ము, అబ్దుల్ కలాం, బీఆర్ అంబేద్కర్, ఎన్టీఆర్, నరేంద్ర మోదీ వంటి మహనీయులంతా సాధారణ కుటుంబాల నుంచి వచ్చినవారే. ‘నేను ఏంటి? ఎలా ఎదగాలి? ఈ సమాజానికి, దేశానికి నేనేం ఇవ్వాలి?’ అనే లక్ష్యంతో పనిచేయాలి. మీ విజయం దేశ విజయమవుతుంది.." అని ఆయన పేర్కొన్నారు. ఈ స్ఫూర్తిని వ్యాపింపజేసేందుకు ఆగస్టు 9 నుంచి 15 వరకు 'అనే నేను' పేరుతో ఒక ఉద్యమంలా ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

గిరిజన ఉత్పత్తులకు గ్లోబల్ బ్రాండింగ్.. అరకు కాఫీ ఒక సక్సెస్ స్టోరీ

గిరిజన ప్రాంతాల్లోని ఆర్థిక స్వావలంబనపై చంద్రబాబు ప్రత్యేకంగా దృష్టి సారించారు. తాను 25 ఏళ్ల క్రితం ఒక చిరు ప్రయత్నంగా ప్రారంభించిన అరకు కాఫీ, నేడు ప్రపంచవ్యాప్తంగా ప్రఖ్యాతి గాంచడాన్ని ఆయన గుర్తుచేశారు. "అరకు కాఫీకి నేనే పేరు పెట్టాను. దానిని మార్కెటింగ్ చేసి, ప్రధాని నరేంద్ర మోడీ నుంచి ఆస్ట్రేలియా ప్రధాని వరకు బహుకరించి, గ్లోబల్ బ్రాండ్‌గా నిలబెట్టాను. ఇవాళ పారిస్‌లో కూడా అరకు కాఫీ స్టాళ్లు ఉన్నాయి" అని గర్వంగా ప్రకటించారు. 

ఇదే స్ఫూర్తితో సీతంపేట పసుపు, రంపచోడవరం రబ్బర్, పార్వతీపురం పైనాపిల్, తేనె, తాటిబెల్లం వంటి స్థానిక ఉత్పత్తులకు విలువ జోడించి, బ్రాండింగ్ చేసి, మార్కెటింగ్ చేసే బాధ్యతను ప్రభుత్వమే తీసుకుంటుందని హామీ ఇచ్చారు. గిరిజన ప్రాంతాల్లోని రైతులు పండించే ప్రతి పంటకు గిట్టుబాటు ధర కల్పించి, వారిని ఆర్థికంగా బలోపేతం చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ సంస్థలతో 19 అవగాహన ఒప్పందాలు (ఎంఓయూ) కుదుర్చుకున్నట్లు వెల్లడించారు.

మౌలిక వసతులు, విద్య, వైద్యానికి పెద్దపీట

గిరిజన ప్రాంతాల సమగ్రాభివృద్ధికి నాలుగు కీలక రంగాలపై దృష్టి పెడుతున్నట్లు ముఖ్యమంత్రి ప్రకటించారు. మౌలిక సదుపాయాలు, విద్య, వైద్యం, ఆదాయ మార్గాల పెంపునకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు.

మౌలిక వసతులు: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో 2,336 గిరిజన ఆవాసాలకు మిషన్ మోడ్‌లో రోడ్ కనెక్టివిటీ కల్పిస్తామన్నారు. 'జల్ జీవన్ మిషన్' కింద 2027 డిసెంబర్ నాటికి ప్రతి గిరిజన ఇంటికి కుళాయి ద్వారా సురక్షిత నీటిని అందిస్తామని హామీ ఇచ్చారు. మారుమూల గ్రామాలకు సైతం టెలికాం కనెక్టివిటీ అందించి, డోలీ మోతలు లేని సమాజాన్ని నిర్మిస్తామన్నారు.

విద్య: 'తల్లికి వందనం' కింద 4.92 లక్షల మంది గిరిజన విద్యార్థులకు రూ.650 కోట్లు అందించామని, ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యకు పెద్దపీట వేస్తున్నామని తెలిపారు. విశాఖలోని మేకవారిపాలెంలో 600 మంది విద్యార్థులతో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటు చేసి, ఐఐటీ వంటి జాతీయ పరీక్షలకు ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు చెప్పారు. ఏటా కనీసం 100 మంది గిరిజన విద్యార్థులు జాతీయ స్థాయి సంస్థల్లో సీట్లు సాధించడమే లక్ష్యమన్నారు.

వైద్యం: పాడేరులో మెడికల్ కాలేజీతో పాటు పార్వతీపురం, రంపచోడవరం, శ్రీశైలం వంటి ప్రాంతాల్లో మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రులు నిర్మిస్తామన్నారు. 'సంజీవిని' ప్రాజెక్ట్ ద్వారా ప్రతి ఒక్కరి ఆరోగ్య వివరాలను డిజిటలైజ్ చేస్తామని, సికిల్ సెల్ అనీమియా బాధితులకు రూ.10,000 పింఛను అందిస్తూ, వ్యాధి నిర్మూలనకు కృషి చేస్తామని ప్రకటించారు.

జీవో నెంబర్ 3 పరిరక్షణకు కట్టుబడి ఉన్నాం

గిరిజన ప్రాంతాల్లో ఉద్యోగాలు స్థానికులకే దక్కాలనే ఆశయంతో ఎన్టీఆర్ హయాంలో పురుడుపోసుకుని, తాను 2000 సంవత్సరంలో తీసుకొచ్చిన జీవో నెంబర్ 3ను కాపాడతామని చంద్రబాబు స్పష్టమైన హామీ ఇచ్చారు. సుప్రీంకోర్టులో ఈ జీవోను కొట్టివేయడానికి గత ప్రభుత్వ వైఫల్యమే కారణమని విమర్శించారు. "ఈ జీవోను చట్టపరంగా, రాజ్యాంగబద్ధంగా నిలబడేలా పటిష్టమైన కార్యాచరణ రూపొందిస్తాం. ఆదివాసుల హక్కుల పరిరక్షణకు ఈ ప్రభుత్వం కట్టుబడి ఉంది. ఆవేశంతో కాకుండా ఆలోచనతో, అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని దీనిపై ముందుకు వెళతాం" అని భరోసా ఇచ్చారు.

గిరిజన ప్రాంతాలను కేవలం వెనుకబడిన ప్రాంతాలుగా కాకుండా, అపార అవకాశాలున్న ప్రాంతాలుగా చూస్తున్నామని, అక్కడి పచ్చదనం, స్వచ్ఛమైన వాతావరణాన్ని ఉపయోగించుకుని టూరిజం హబ్‌లుగా తీర్చిదిద్దుతామని అన్నారు. ప్రతి గిరిజన ఇల్లు 'అతిథి గృహం'గా మారాలని, తద్వారా ప్రపంచానికి ఆతిథ్యం ఇవ్వాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఒక చెట్టు నాటి, దానిని సంరక్షించడం ద్వారా పర్యావరణ పరిరక్షణలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. 2047 నాటికి 'వికసిత్ భారత్', 'స్వర్ణాంధ్రప్రదేశ్' లక్ష్యాలను సాధించడంలో ఆదివాసీలు కీలక పాత్ర పోషించాలని, వారి సర్వతోముఖాభివృద్ధికి ప్రభుత్వం అండగా ఉంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పునరుద్ఘాటించారు.
Advertisement
Chandrababu Naidu
World Tribal Day
Andhra Pradesh Tribal Welfare
Araku Coffee Global Branding
GO Number 3 Protection
Vijayawada Ambedkar Kalavedika

More Telugu News