ఇలా గాయాలతో ప్రపంచ కప్‌ కొట్టడం కష్టమే.. నిర్మొహమాటంగా అంగీకరించిన కెప్టెన్‌ గిల్‌

Shubman Gill expresses concern over Indian players fitness after England series loss
  • టీమిండియా ఫిట్‌నెస్‌పై గిల్‌ ఆందోళన
  • వరుస గాయాలతో జట్టుకు నష్టమని విశ్లేషణ
  • ప్రపంచకప్‌ గెలవాలంటే ఈ లోపాన్ని అధిగమించాల్సిందేనన్న కెప్టెన్‌ 
  • బౌలర్లపై తీరుపైనా అసంతృప్తి
  • కీలక సందర్భాల్లో తడబడినట్లు అంగీకరించిన గిల్‌
ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్‌ కోల్పోయిన తర్వాత భారత కెప్టెన్‌ శుభ్‌మన్‌ గిల్‌ జట్టు ఫిట్‌నెస్‌పై కీలక వ్యాఖ్యలు చేశాడు. 2027 వన్డే ప్రపంచకప్‌ గెలవాలంటే ఆటగాళ్లు తరచూ గాయపడే పరిస్థితి మారాల్సిందేనని స్పష్టం చేశాడు. కేవలం ఆటగాళ్లు మాత్రమే కాదు.. బీసీసీఐ వైద్య బృందం కూడా ఈ అంశంపై ప్రత్యేక దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందని సూచించాడు.

లార్డ్స్‌లో జరిగిన నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్‌ తన అత్యుత్తమ జట్టుతో బరిలోకి దిగలేకపోయింది. జస్‌ప్రీత్‌ బుమ్రా, వాషింగ్టన్‌ సుందర్‌, హర్షిత్‌ రాణా, నితీశ్‌ కుమార్‌ రెడ్డి గాయాల కారణంగా దూరమయ్యారు. దీంతో ప్రతిసారీ జట్టు కూర్పును మార్చాల్సి వచ్చిందని గిల్‌ చెప్పాడు. ఒక ఆటగాడు గాయపడితే ప్రత్యామ్నాయం వెతకవచ్చని, కానీ ప్రతి మ్యాచ్‌కు ఒకరు లేక ఇద్దరు అందుబాటులో లేకపోతే అసలు ప్రణాళికే దెబ్బతింటుందని వ్యాఖ్యానించాడు.

ప్రపంచకప్‌లో వరుసగా 11 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంటుందని గిల్‌ గుర్తు చేశాడు. అలాంటప్పుడు రెండు లేదా మూడు మ్యాచ్‌ల సిరీస్‌నైనా పూర్తి చేయలేకపోతే అది ఆందోళన కలిగించే విషయమేనన్నాడు. మ్యాచ్‌ రోజు ఉదయం ఎవరికైనా చిన్న గాయం ఉందని తెలిస్తే జట్టు వ్యూహమే మారిపోతుందని చెప్పాడు. 80 శాతం ఫిట్‌గా ఉన్న ఆటగాణ్ని ఆడించాలా? వద్దా? అనే సందిగ్ధ పరిస్థితి ఏర్పడుతుందని వివరించాడు.

లార్డ్స్‌ మ్యాచ్‌లో భారత బౌలర్ల ప్రదర్శనపై కూడా గిల్‌ అసంతృప్తి వ్యక్తం చేశాడు. తొలి 10 ఓవర్లలో ఎక్కువగా చెత్త బంతులు వేయడంతో ఇంగ్లండ్‌కు శుభారంభం లభించిందన్నాడు. చివరి మూడు ఓవర్లలో ఏకంగా 63 పరుగులు ఇవ్వడంతో మ్యాచ్‌ పూర్తిగా ప్రత్యర్థి వైపు తిరిగిందని చెప్పాడు. ఒక దశలో 340-350 పరుగులకే ఇంగ్లండ్‌ను పరిమితం చేయొచ్చని అనిపించినా.. చివరికి 390కు చేరుకోవడంతో లక్ష్య ఛేదన కష్టంగా మారిందని వివరించాడు.

సిరీస్‌లో ఒక్క స్పిన్నర్‌తోనే బరిలోకి దిగిన విషయంపైనా గిల్‌ స్పందించాడు. బర్మింగ్‌హామ్‌, కార్డిఫ్‌ పిచ్‌లు స్పిన్నర్లకు పెద్దగా అనుకూలించలేదని, అందుకే అదనపు పేసర్‌తో ఆడాల్సి వచ్చిందని చెప్పాడు. మధ్య ఓవర్లలో వికెట్లు తీయాలనే ఉద్దేశంతోనే ఆ నిర్ణయం తీసుకున్నామని వివరించాడు.

సిరీస్‌ ఓడినా జట్టు మొత్తం ప్రదర్శనను తక్కువగా అంచనా వేయలేమని గిల్‌ అన్నాడు. ఎక్కువసేపు మ్యాచుల్లో భారత్‌ ఆధిపత్యం ప్రదర్శించిందని, కానీ మ్యాచ్‌ను మలుపు తిప్పే కీలక సందర్భాల్లోనే వెనుకబడిందని విశ్లేషించాడు. భవిష్యత్‌లో పరిస్థితులను మరింత తెలివిగా అంచనా వేసి నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నాడు.
Advertisement
Shubman Gill
Team India injuries
India vs England ODI series
2027 Cricket World Cup
BCCI medical team
Indian cricket team fitness

More Telugu News