‘ఇరాన్ తప్పుడు నిర్ణయం తీసుకుంది.. ఇప్పుడు మూల్యం చెల్లిస్తోంది’: అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్

Pete Hegseth says Iran made a wrong decision and is now paying the price
  • హర్మూజ్ జలసంధిలో సైప్రస్ వాణిజ్య నౌకపై ఇరాన్ బలగాల దాడి
  • ప్రతిగా ఒకే వారంలో మూడోసారి అమెరికా భీకర వైమానిక దాడులు
  • ‘హర్మూజ్’ను నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటన
  • అమెరికా మరిన్ని దాడులు చేస్తే ప్రాంతీయ స్థావరాలపై దాడి చేస్తామని హెచ్చరిక
అంతర్జాతీయంగా అత్యంత కీలకమైన సముద్ర రవాణా మార్గం 'హర్మూజ్ జలసంధి' వేదికగా అమెరికా, ఇరాన్ దేశాల మధ్య ఉద్రిక్తతలు యుద్ధ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. ‘హర్మూజ్’ గుండా సైప్రస్ జెండాతో వెళ్తున్న 'ఎం/వి జిఎఫ్ఎస్ గెలాక్సీ' అనే వాణిజ్య కంటైనర్ నౌకపై ఇరాన్ ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (ఐఆర్‌జీసీ) బలగాలు దాడి చేయడంపై అమెరికా తీవ్రంగా స్పందించింది. ఇరాన్ చర్యకు ప్రతికారంగా అమెరికా మిలటరీ శనివారం ఇరాన్‌పై భీకర వైమానిక దాడులకు దిగింది. ఒకే వారంలో ఇరాన్ లక్ష్యాలపై అమెరికా దాడులు చేయడం ఇది మూడోసారి.

ఈ దాడులను ధ్రువీకరిస్తూ అమెరికా సెంట్రల్ కమాండ్ విడుదల చేసిన అధికారిక ప్రకటనను అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్‌సెత్ ఎక్స్ వేదికగా రీషేర్ చేశారు. ఇరాన్‌ను తీవ్రంగా హెచ్చరిస్తూ.. "ఇరాన్ చాలా తప్పుడు నిర్ణయం తీసుకుంది. ఇప్పుడు దానికి తగిన మూల్యం చెల్లించుకుంటోంది" అని ఆయన రాసుకొచ్చారు.

అమెరికా మిలటరీ సమాచారం ప్రకారం.. శనివారం రాత్రి 7:15 గంటలకు సెంట్‌కామ్ దళాలు ఇరాన్‌పై దాడులు ప్రారంభించాయి. అంతకుముందు ఇరాన్ బలగాలు అంతర్జాతీయ జలమార్గ నిబంధనలను ఉల్లంఘిస్తూ వాణిజ్య నౌకపై దాడికి తెగబడ్డాయి. అయితే, దీనిపై ఇరాన్ ఐఆర్‌జీసీ నేవీ స్పందిస్తూ.. సదరు కంటైనర్ నౌక అనుమతి లేని మార్గంలో ప్రయాణించిందని, తమ హెచ్చరికలను పదే పదే నిర్లక్ష్యం చేయడం వల్లే తాము దానిని అడ్డుకుని దాడి చేయాల్సి వచ్చిందని సమర్థించుకుంది. మరోవైపు, అంతర్జాతీయ షిప్పింగ్ నిబంధనలను పాటించడానికి ఇరాన్‌కు గతంలోనే అవకాశం ఇచ్చినప్పటికీ అది మళ్లీ విఫలమైందని, అందుకే ఇరాన్ దాడి చేసే సామర్థ్యాలను దెబ్బతీసేందుకు తాము భారీ స్థాయిలో దాడులు జరిపామని అమెరికా స్పష్టం చేసింది.

జలసంధి మూసివేత
అమెరికా దాడులు ప్రారంభించిన వెంటనే ఇరాన్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. అంతర్జాతీయ వాణిజ్యానికి గుండెకాయ లాంటి హర్మూజ్ జలసంధిని ‘తదుపరి నోటీసు ఇచ్చే వరకు’ నిరవధికంగా మూసివేస్తున్నట్లు ఇరాన్ ప్రకటించింది. అనుమతి లేని మార్గంలో వెళ్తున్న ఒక నౌకపై తాము జరిపిన హెచ్చరిక కాల్పులు దానికి తగిలాయని ఇరాన్ వెల్లడించింది.

"ఈ తాజా ఘటన నేపథ్యంలో.. ఈ ప్రాంతంలో అమెరికా జోక్యం పూర్తిగా ముగిసేవరకు హర్మూజ్ జలసంధి మూసివేయబడుతుంది. ఏ నౌకను కూడా దీని గుండా వెళ్ళనిచ్చే ప్రసక్తే లేదు’ అని ఇరాన్ విప్లవ దళాలు ఐఆర్ఎన్ఏ వార్తా సంస్థ ద్వారా స్పష్టం చేశాయి. అంతేకాకుండా, అమెరికా గనుక తమపై మరిన్ని దాడులకు దిగితే, ఈ ప్రాంతంలో ఉన్న మరికొన్ని శత్రు దేశాల (అమెరికా, దాని మిత్రదేశాల) సైనిక స్థావరాలపై భీకర దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది.

మరోవైపు అమెరికా వైమానిక దాడుల ధాటికి హర్మూజ్ జలసంధి తీర ప్రాంతాలైన బందర్ అబ్బాస్, సిరిక్ వంటి కోస్తా పట్టణాలలో భారీ పేలుళ్లు సంభవించినట్లు ఇరాన్ ప్రభుత్వ మీడియా ధ్రువీకరించింది. ఈ తాజా పరిణామాలతో గల్ఫ్ ప్రాంతంలో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియని అత్యంత ఉత్కంఠ భరిత వాతావరణం నెలకొంది.
Advertisement
Pete Hegseth
Iran US conflict
Strait of Hormuz
US airstrikes on Iran
IRGC
Gulf maritime security

More Telugu News