ముత్తూట్ ఫైనాన్స్‌లో భారీ మోసం.. కస్టమర్ల బంగారాన్ని మరో సంస్థలో తాకట్టు పెట్టిన మేనేజర్

Muthoot Finance Fraud Manager Pledges Customers Gold in Another Firm
  • హైదరాబాద్‌లోని ముత్తూట్ ఫైనాన్స్‌లో వెలుగుచూసిన వైనం
  • కస్టమర్ల బంగారాన్ని దుర్వినియోగం చేశారని బ్రాంచ్ మేనేజర్‌పై ఆరోపణ
  • తక్కువ వడ్డీ ఆశ చూపి సొంత ఖాతాలకు డబ్బు మళ్లింపు
  • మేనేజర్ ప్రియాంక రెడ్డిపై కేసు నమోదు చేసిన కేపీహెచ్‌బీ పోలీసులు
హైదరాబాద్‌లోని కేపీహెచ్‌బీ కాలనీలో గల ప్రముఖ నాన్-బ్యాంకింగ్ ఫైనాన్స్ సంస్థ 'ముత్తూట్ ఫైనాన్స్' బ్రాంచ్‌లో భారీ మోసం వెలుగుచూసింది. ఖాతాదారులు తాకట్టు పెట్టిన బంగారు ఆభరణాలను బ్రాంచ్ మేనేజర్ దుర్వినియోగం చేశారని, తమను ఆర్థికంగా నష్టపరిచారని బాధితులు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

కేపీహెచ్‌బీ ఫేజ్-6 బ్రాంచ్ మేనేజర్ ప్రియాంక రెడ్డి ఈ మోసానికి సూత్రధారి అని ఆరోపణలు వస్తున్నాయి. సుమారు 50 పైసల తక్కువ వడ్డీకే రుణాలు ఇస్తామని కస్టమర్లను నమ్మించి, వారి నుంచి బంగారాన్ని డిపాజిట్ చేయించుకున్నారు. అనంతరం ఆ తర్వాత ఆ బంగారాన్ని తనకు సంబంధమున్న మరో ఫైనాన్స్ సంస్థలో తాకట్టు పెట్టి, ఆ నిధులను తన వ్యక్తిగత ఖాతాలకు మళ్లించుకున్నట్లు అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. అక్రమ లావాదేవీల నిర్వహణ కోసం కస్టమర్ల ఫోన్లకు వచ్చే ఓటీపీలను సైతం ఆమె మాయమాటలతో సేకరించినట్టు తెలిసింది.

గురువారం ఓ వృద్ధుడు తాను తీసుకున్న రుణాన్ని పూర్తిగా చెల్లించి, తన బంగారు ఆభరణాలను తిరిగి ఇవ్వాలని కోరడంతో ఈ వ్యవహారం బయటపడింది. ఆ సమయంలో మేనేజర్ పొంతన లేని సమాధానాలు చెప్పడంతో అనుమానం వచ్చిన మిగతా బాధితులు సైతం ఆమెను నిలదీశారు. తాము మోసపోయామని గ్రహించిన బాధితులంతా కలిసి కేపీహెచ్‌బీ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.

బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు కేపీహెచ్‌బీ ఎస్‌హెచ్‌ఓ రాజశేఖర్ రెడ్డి తెలిపారు. సంస్థలో సమగ్ర ఆడిట్ నిర్వహిస్తేనే మోసం విలువపై స్పష్టత వస్తుందని, ఇది కోట్లలో ఉండే అవకాశం ఉందని పోలీసులు అంచనా వేస్తున్నారు. ఈ ఘటనతో ముత్తూట్ ఫైనాన్స్‌‌లో బంగారం తాకట్టు పెట్టిన ఖాతాదారుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది.
Advertisement
Muthoot Finance
Priyanka Reddy
KPHB Hyderabad
Gold Loan Fraud
Muthoot Finance Fraud Case

More Telugu News