నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో సీఎం చంద్రబాబు ప‌ర్య‌ట‌న‌.. రైతులకు భూ హక్కుల పండుగ

  • 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా రైతులకు పట్టాల పంపిణీ
  • 22-ఏ నిషేధిత జాబితా నుంచి 2074 ఎకరాలకు విముక్తి కల్పిస్తూ ఉత్తర్వులు
  • చుక్కల భూముల సమస్యకు కూడా పరిష్కారం చూపుతున్న ప్రజా ప్రభుత్వం
  • దశాబ్దాలుగా నలుగుతున్న రైతుల భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యం
దశాబ్దాలుగా పరిష్కారానికి నోచుకోని భూ సమస్యలకు చరమగీతం పాడేందుకు ప్రజా ప్రభుత్వం మరో కీలక ముందడుగు వేసింది. రైతుల భూములకు సంపూర్ణ హక్కులు కల్పించడమే లక్ష్యంగా చేపట్టిన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమంలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేడు నంద్యాల జిల్లా బనగానపల్లెలో పర్యటించ‌నున్నారు. ఈ పర్యటన ద్వారా వేలాది ఎకరాల భూములకు నిషేధిత జాబితాల నుంచి విముక్తి కల్పించి, రైతులకు శాశ్వత హక్కు పత్రాలను అందజేయనున్నారు.

ఈ పర్యటనలో భాగంగా బేతంచర్ల మండలం గుటుపల్లి గ్రామానికి చెందిన 897 మంది రైతులకు ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. దశాబ్దాలుగా వారిని ఇబ్బందులకు గురిచేస్తున్న 2074 ఎకరాల భూమిని 22-ఏ నిషేధిత జాబితా నుంచి తొలగిస్తూ ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేసింది. సీఎం చంద్రబాబు తన సమక్షంలోనే ఈ భూములను నిషేధిత జాబితా నుంచి ఆన్‌లైన్‌లో తొలగించి, సంబంధిత రైతులకు హక్కు పత్రాలను స్వయంగా అందజేయనున్నారు. తమ సొంత భూమిపై అమ్ముకునే హక్కు గానీ, రుణాలు పొందే అవకాశం గానీ లేక ఏళ్లుగా ఎదురుచూస్తున్న రైతులకు ఇది చరిత్రాత్మక క్షణంగా నిలవనుంది.

అంతేకాకుండా బనగానపల్లె నియోజకవర్గంలో మరో తీవ్రమైన సమస్యగా ఉన్న చుక్కల భూముల వ్యవహారానికి కూడా ప్రభుత్వం పరిష్కారం చూపింది. నియోజకవర్గంలోని 23 మంది రైతులకు చెందిన 101 ఎకరాల చుక్కల భూములను ఆ జాబితా నుంచి తొలగించి, వారికి పూర్తి యాజమాన్య హక్కులు కల్పిస్తూ ముఖ్యమంత్రి ఉత్తర్వులు అందించనున్నారు.

ప్రతి నెలా 9వ తేదీన 'మీ భూమి-మీ హక్కు' కార్యక్రమం ద్వారా రాష్ట్రవ్యాప్తంగా భూ సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇందులో భాగంగానే నేటి కార్యక్రమం జరుగుతోంది. పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు తొలుత స్థానిక తహసీల్దార్ కార్యాలయాన్ని సందర్శించి, అనంతరం బహిరంగ సభలో పాల్గొని రైతులతో ముచ్చటిస్తారు. 

ఇక‌, ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పటికే తిరుపతి జిల్లా శెట్టిపల్లి, గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు, చిత్తూరు జిల్లా కంగుంది గ్రామాల్లో ఇలాంటి దీర్ఘకాలిక భూ వివాదాలను పరిష్కరించింది. రాష్ట్రవ్యాప్తంగా ఈ జులై నెలతో కలిపి ఇప్పటివరకు 6,887 గ్రామాల్లో 29.04 లక్షల కొత్త పట్టాదార్ పాస్ పుస్తకాలను ప్రభుత్వం పంపిణీ చేసింది. ఈ నెలలో 428 గ్రామాల్లో 2.48 లక్షల పాస్ పుస్తకాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఒక్క నంద్యాల జిల్లాలోనే ఈ నెల 8,412 మంది రైతులకు కొత్త పాస్ పుస్తకాలు అందనున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా భూ రికార్డుల ప్రక్షాళన చేస్తూ, రైతులకు వారి ఆస్తిపై భరోసా కల్పించడమే ప్రభుత్వ ధ్యేయమని అధికారులు స్పష్టం చేశారు.

Nara Chandrababu Naidu
Banaganapalle Nandyal Visit
Mee Bhoomi Mee Hakku
Andhra Pradesh Land Rights
22A Prohibited Lands Removal
Farmer Land Passbooks

More Telugu News