ప్రభుత్వ ఉద్యోగం కోసం దారుణం.. తల్లి హత్యకు రూ. 7 లక్షల సుపారీ ఇచ్చిన కూతురు!

Ayushi Sharma pays 7 lakh supari to kill mother for government job
  • ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లిని హత్య చేయించిన కూతురు
  • జైపూర్‌లో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక
  • రూ. 7 లక్షలు ఇచ్చి కిరాయి హంతకులతో చంపించిన వైనం
  • కూతురు సహా ఏడుగురిని అరెస్ట్ చేసిన పోలీసులు
  • సీసీటీవీ కెమెరాల ద్వారా బట్టబయలైన హత్య కుట్ర
 ఆస్తి, ప్రభుత్వ ఉద్యోగం కోసం కన్నతల్లినే ఓ కూతురు కిరాయి హంతకులతో కలిసి అత్యంత దారుణంగా హత్య చేయించడం రాజస్థాన్‌లోని జైపూర్‌లో సంచలనం రేపింది. ఈ హత్యను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు పక్కా ప్రణాళిక రచించింది. అయితే, పోలీసుల దర్యాప్తులో అసలు నిజం బయటపడింది. ఈ కేసుకు సంబంధించి పోలీసులు మృతురాలి కుమార్తె ఆయుషి శర్మ (23) సహా ఏడుగురిని అరెస్ట్ చేశారు. మరో నిందితుడు పరారీలో ఉన్నాడు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జైపూర్‌లోని ఓ కోర్టులో లోయర్ డివిజన్ క్లర్క్ (ఎల్‌డీసీ)గా పనిచేస్తున్న నీరజ్ శర్మ (45) జులై 3న దారుణ హత్యకు గురయ్యారు. ప్రతాప్ నగర్ ప్రాంతంలో తన కొడుకుని కోచింగ్ సెంటర్‌లో దించి స్కూటర్‌పై ఇంటికి తిరిగి వస్తుండగా, సుమారు 130 కిలోమీటర్ల వేగంతో వచ్చిన స్కార్పియో వాహనం ఆమెను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమె దాదాపు 100 అడుగుల దూరం ఎగిరిపడి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాదం జరిగిన వెంటనే నిందితులు వాహనంతో పరారయ్యారు.

మొదట దీనిని రోడ్డు ప్రమాదంగా భావించినప్పటికీ, పోలీసులు ఘటనా స్థలంలోని సీసీటీవీ ఫుటేజ్‌ను పరిశీలించగా ఇది ప్రమాదం కాదని, ఉద్దేశపూర్వకంగా చేసిన హత్య అని నిర్ధారణకు వచ్చారు. దీంతో హత్య కోణంలో దర్యాప్తు ప్రారంభించి కుట్రను ఛేదించారు. డీసీపీ రంజితా శర్మ తెలిపిన వివ‌రాల‌ ప్రకారం.. నీరజ్ శర్మ భర్త ఏడాది క్రితం మరణించారు. ఆయన మరణంతో వచ్చిన కారుణ్య నియామకం కింద నీరజ్ ఎల్‌డీసీగా ఉద్యోగంలో చేరారు.

అయితే, తండ్రి మరణం తర్వాత ఆ ప్రభుత్వ ఉద్యోగం తనకు దక్కుతుందని కుమార్తె ఆయుషి ఆశించింది. కానీ, తల్లి ఆ ఉద్యోగాన్ని తీసుకోవడంతో ఆమెపై ఆగ్రహం పెంచుకుంది. దీనికి తోడు గత రెండు, మూడేళ్లుగా తల్లీకూతుళ్ల మధ్య ఆస్తి వివాదాలు కూడా నడుస్తున్నాయి. ఈ క్రమంలోనే తల్లిని అడ్డు తొలగించుకోవాలని ఆయుషి నిర్ణయించుకుంది. తన మామ మోహన్ స్వరూప్, కజిన్ బలరాం అలియాస్ రవితో కలిసి కుట్ర పన్నింది. భరత్‌పూర్‌కు చెందిన హేమంత్ శర్మ అనే వ్యక్తికి రూ. 7 లక్షలకు సుపారీ ఇచ్చి హత్యకు ఒప్పందం కుదుర్చుకుంది.

హత్యకు ముందు నిందితులు దాదాపు నెల రోజుల పాటు నీరజ్ కదలికలపై నిఘా పెట్టారు. మొదట అద్దెకు తీసుకున్న థార్ వాహనంతో హత్యకు ప్రయత్నించి విఫలమయ్యారు. జులై 3న పక్కా ప్రణాళికతో ఆమెను వెంబడించారు. మోహిత్ శర్మ అనే వ్యక్తి ఆమె లొకేషన్‌ను హంతకులకు చేరవేయగా, ఆకాశ్ శర్మ స్కార్పియోను నడుపుతూ నీరజ్‌ను ఢీకొట్టాడు. అనంతరం వాహనాన్ని వదిలేసి మరో బైక్‌పై పరారయ్యారు.

మృతురాలి సోదరుడు రాకేశ్‌ కుమార్ శర్మ ఇచ్చిన ఫిర్యాదుతో దర్యాప్తు వేగవంతమైంది. ఆస్తి కోసం తన సోదరిని కుమార్తె ఆయుషి, అత్తింటివారు వేధిస్తున్నారని, పలుమార్లు ప్రాణహాని ఉందని ఆమె చెప్పినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విచారణలో ఆయుషి నేరాన్ని అంగీకరించింది. ఉద్యోగం, ఆస్తి కోసమే ఈ హత్య చేయించినట్లు ఒప్పుకుంది. పోలీసులు ఆయుషి శర్మ, మోహన్ స్వరూప్, మోహిత్ శర్మ, ఆకాశ్ శర్మ, అరవింద్ శర్మ, హేమంత్ శర్మ, రోహిత్ జాదవ్‌లను అరెస్ట్ చేశారు. ప్రధాన కుట్రదారుల్లో ఒకడైన బలరాం పరారీలో ఉన్నాడని, అతని కోసం గాలిస్తున్నామని పోలీసులు తెలిపారు.
Advertisement
Ayushi Sharma
Jaipur mother murder case
Rajasthan crime news
Government job murder conspiracy
Neeraj Sharma murder
Supari killing case Rajasthan

More Telugu News