కొడుకు కోసం సినిమాల ఎంపికను మార్చుకున్న కాజల్ అగర్వాల్!
- పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తున్న కాజల్
- తన కొడుకు గర్వపడే సినిమాలనే చేస్తానని వెల్లడి
- సందేశాత్మక చిత్రాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నానన్న కాజల్
స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి, మాతృత్వం తర్వాత కూడా తన సినీ ప్రయాణాన్ని విజయవంతంగా కొనసాగిస్తోంది. అయితే తల్లి అయిన తర్వాత సినిమాల ఎంపికలో తన ఆలోచనా విధానం పూర్తిగా మారిపోయిందని ఆమె తాజాగా వెల్లడించింది. ప్రస్తుతం 'ది ఇండియా స్టోరీ'తో పాటు ప్రతిష్ఠాత్మక పాన్ ఇండియా చిత్రం ‘రామాయణ’ షూటింగ్లతో బిజీగా ఉన్న కాజల్... తన కొడుకు నీల్ పెద్దయ్యాక తన సినిమాలు చూసి గర్వంగా చెప్పుకునేలా ఉండే స్క్రిప్ట్లను ఎంచుకుంటున్నట్లు తెలిపింది. కమర్షియల్ అంశాల కంటే బలమైన పాత్రలు, సందేశాత్మక చిత్రాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు చెప్పింది.
చేతన్ డీకే దర్శకత్వంలో రూపొందుతున్న 'ది ఇండియా స్టోరీ'లో కాజల్ పవర్ఫుల్ లాయర్ పాత్రలో కనిపించనుది. శ్రేయస్ తల్పడే కీలక పాత్ర పోషిస్తున్న ఈ చిత్రం జూలై 24న విడుదల కానుంది. కల్తీ ఆహారం, పురుగుమందుల ప్రభావం నేపథ్యంలో సాగే ఈ కథ విన్నాక... ఒక తల్లిగా తన ఇంట్లో వాడే ఆహార పదార్థాల విషయంలో మరింత జాగ్రత్తలు తీసుకోవడం ప్రారంభించానని కాజల్ పేర్కొంది.
మరోవైపు, నితేష్ తివారీ దర్శకత్వంలో రణ్బీర్ కపూర్, సాయిపల్లవి, యశ్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న ‘రామాయణ’లో కాజల్ మండోదరి పాత్ర పోషిస్తోంది. తన కుమారుడు నీల్కు చిన్నప్పటి నుంచే రామాయణ కథలంటే ఇష్టమని, అయితే అతనికి శ్రీరాముడి కంటే రావణుడి పాత్రే ఎక్కువ ఇష్టమని నవ్వుతూ చెప్పింది. ‘రామాయణ’ రెండో భాగం విడుదలయ్యే సమయానికి నీల్కు ఐదేళ్లు వస్తాయని, థియేటర్లో వాడు చూసే మొదటి సినిమా ఇదే అవుతుందని కాజల్ ఆనందం వ్యక్తం చేసింది.