భారత్ సరిహద్దుకు కూతవేటు దూరంలో చైనా సైనిక వ్యూహం: న్యూఢిల్లీని కలవరపెడుతున్న సరికొత్త వివాదం!

China military strategy near Indian border latest controversy worrying New Delhi
  • తీస్తా నది ప్రాజెక్టుపై చైనా-బంగ్లాదేశ్ ఒప్పందం
  • సిలిగురి కారిడార్‌కు అతిసమీపంలో నిర్మాణాలు
  • పెరగనున్న చైనా సైనిక-పౌర వ్యూహాత్మక జోక్యం
  • నిఘా, రక్షణ పరంగా భారత్‌కు సవాల్ 
బంగ్లాదేశ్ ప్రధాన మంత్రి తారిఖ్ రెహమాన్ చైనా పర్యటనలో భాగంగా 'తీస్తా నది సమగ్ర నిర్వహణ, పునరుద్ధరణ ప్రాజెక్టు' (టీఆర్‌సీఎంఆర్‌పీ) సాధ్యాసాధ్యాల అధ్యయనం (ఫీజిబిలిటీ స్టడీ) కోసం ఇరు దేశాలు ఒక కీలక ఒప్పందంపై సంతకాలు చేశాయి. ఢాకా, బీజింగ్ మధ్య పెరుగుతున్న బంధానికి ఈ ప్రాజెక్టు నిదర్శనంగా కనిపిస్తున్నప్పటికీ, భారత్‌కు అత్యంత కీలకమైన, వ్యూహాత్మక సిలిగురి కారిడార్ (చికెన్స్ నెక్)కు అతి సమీపంలో చైనా అడుగుపెడుతుండటం ఇప్పుడు న్యూఢిల్లీలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

తూర్పు హిమాలయాల్లో ఉద్భవించి సిక్కిం, పశ్చిమ బెంగాల్ మీదుగా బంగ్లాదేశ్‌లో ప్రవహించే 414 కిలోమీటర్ల తీస్తా నది నీటి పంపకాలపై భారత్, బంగ్లాదేశ్ మధ్య ఎప్పటి నుంచో వివాదం నడుస్తోంది. గతంలో షేక్ హసీనా ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు, ఆర్థిక ఇబ్బందులు, భారత రక్షణ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని ఈ చైనా ప్రాజెక్టుకు తుది అనుమతులు ఇవ్వకుండా నిలిపివేశారు. ఆ సమయంలో ప్రాజెక్టు కోసం బిలియన్ డాలర్ల నిధులు ఇచ్చేందుకు భారత్ కూడా ప్రతిపాదించింది. 

కానీ హసీనా హఠాత్తుగా గద్దె దిగడం, ఆ తర్వాత వచ్చిన మొహమ్మద్ యూనస్ తాత్కాలిక ప్రభుత్వం కాలంలో చర్చలు నిలిచిపోవడంతో భారత్ ప్రతిపాదన మూలన పడింది. తాజాగా అధికారంలోకి వచ్చిన బీఎన్‌పీ ప్రభుత్వం మళ్లీ చైనాను చేరదీసి ఈ ప్రాజెక్టును పట్టాలెక్కించింది. 140 మిలియన్ క్యూబిక్ మీటర్ల పూడికతీత, 171 చదరపు కిలోమీటర్ల భూసేకరణ, 224 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణంతో కూడిన ఈ భారీ ప్రాజెక్టును చైనాకు చెందిన ప్రభుత్వ రంగ సంస్థ 'పవర్ చైనా' చేపట్టబోతోంది. ఈ సంస్థకు చైనా సైన్యంతోనూ, కమ్యూనిస్ట్ పార్టీ భౌగోళిక రాజకీయ లక్ష్యాలతోనూ ప్రత్యక్ష సంబంధాలు ఉన్నాయి.

భారత సరిహద్దుకు కేవలం 10 నుంచి 12 కిలోమీటర్ల లోపే ఉన్న ఈ ప్రాంతంలో చైనా ఇంజనీర్లు, సాంకేతిక నిపుణుల మోహరింపు భారత్‌కు పెద్ద రక్షణ ముప్పుగా పరిణమించనుంది. చైనా జోక్యంతో తీస్తా నది కేవలం సాంకేతిక నీటి వివాదంగా మిగలకుండా తీవ్రమైన భద్రతా సమస్యగా మారుతుందని రక్షణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. పాకిస్థాన్, చైనాల నుంచి భారత్ ఇప్పుడు ఈశాన్య సరిహద్దుల్లో ఒకేసారి రెండు వైపుల ముప్పును ఎదుర్కోవాల్సి వస్తుందని వ్యూహకర్త తారా కర్తా ఆందోళన వ్యక్తం చేశారు. కాగా, ఈ పరిణామాలపై భారత విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ స్పందిస్తూ.. తీస్తా ప్రాజెక్టుపై తమ అభిప్రాయాలను ఇప్పటికే బంగ్లాదేశ్‌కు తెలియజేశామని, సరిహద్దుల్లో జరుగుతున్న అన్ని పరిణామాలను పరిగణనలోకి తీసుకుంటూనే తమ తదుపరి వ్యూహాలు ఉంటాయని స్పష్టం చేశారు.
Advertisement
China
Teesta River Project
Bangladesh
Siliguri Corridor
India Bangladesh Relations
Tarique Rahman

More Telugu News