ఫేక్ ప్రచారాలపై ఉక్కుపాదం.. అధికారులకు ఏపీ హోంమంత్రి కీలక ఆదేశాలు

Vangalapudi Anitha orders crackdown on fake news and social media propaganda
  • సోషల్ మీడియాలో దుష్ప్రచారంపై ఉక్కుపాదం మోపాలని హోంమంత్రి ఆదేశం
  • ప్రతి జిల్లాలో సైబర్ గార్డ్, సోషల్ మీడియా పర్యవేక్షణ విభాగాలు ఏర్పాటు
  • రాజ్యాంగ పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుంటే కఠిన చర్యలు తప్పవని హెచ్చరిక
  • భావప్రకటనా స్వేచ్ఛకు ఇబ్బంది కలగకూడదని అధికారులకు సూచన
సోషల్ మీడియా వేదికగా వ్యవస్థీకృత దుష్ప్రచారానికి పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ హోంమంత్రి వంగలపూడి అనిత పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు. అశ్లీల పోస్టులు పెట్టడం, రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉన్న వారిని లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారాలకు ఒడిగట్టే వ్యక్తులు, గ్రూపులపై నెట్‌వర్క్ ఆధారిత దర్యాప్తును ముమ్మరం చేయాలని ఆమె స్పష్టం చేశారు.

సోమవారం మంగళగిరిలోని పోలీస్ ప్రధాన కార్యాలయంలో డీజీపీ హరీశ్‌ కుమార్ గుప్తా, ఇతర సీనియర్ అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా హోంమంత్రి మాట్లాడుతూ.. దుష్ప్రచారంపై చర్యలు తీసుకునే క్రమంలో భావప్రకటనా స్వేచ్ఛకు, ప్రజాస్వామ్యబద్ధమైన విమర్శలకు ఎలాంటి ఆటంకం కలగకూడదని అధికారులకు స్పష్టమైన సూచనలు చేశారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో సైబర్ గార్డ్ విభాగాలను, జిల్లాస్థాయి సోషల్ మీడియా పర్యవేక్షణ యూనిట్లను తక్షణమే ఏర్పాటు చేయాలని ఆదేశించారు.

గత రెండేళ్లలో ఇటువంటి నేరాలకు సంబంధించి 1,665 కేసులు నమోదు చేసినట్లు, 'సాక్ష్య' పోర్టల్ ద్వారా సోషల్ మీడియా సంస్థలతో సమన్వయం చేసుకుని 12,653 వెబ్ లింకులను తొలగించినట్లు అధికారులు మంత్రికి వివరించారు. సున్నిత ప్రాంతాల్లో రాజకీయ పర్యటనల నిర్వహణకు సంబంధించి ప్రామాణిక కార్యాచరణ విధానాలు (SOP) రూపొందించాలని, అలాగే భూ వివాదాలకు సంబంధించిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని ఈ సందర్భంగా మంత్రి సూచించారు.                                
Advertisement
Vangalapudi Anitha
AP Home Minister
Andhra Pradesh Police
Social Media Misinformation
Fake News Crackdown
Cyber Guard Units

More Telugu News